గత జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్టలోని ఏడు డివిజన్లు మజ్లీస్ ఖాతాలోనే పడ్డాయి. లలిత్బాగ్ వంటి కొన్ని డివిజన్లలో టీఆర్ఎస్ కాస్త ప్రభావం చూపించినా జెండా మాత్రం పతంగి పార్టీదే ఎగిరింది. ఏడు డివిజన్లలో ఇద్దరు మహిళలు గత ఎన్నికల్లో మజ్లిస్ నుంచి గెలిచారు.
చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్లోని ఏడు డివిజన్లలో కలిపి మొత్తం ఓటర్లు సంఖ్య సుమారు మూడు లక్షలు. ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, బీదర్ వంటి ప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని వలసవచ్చిన వారే అధికం. ఇక బార్కస్ డివిజన్లో అరబ్ దేశీయుల సంఖ్య గణనీయంగా ఉంటుంది.
అక్బరుద్దీన్ సొంత నియోజకవర్గమైనా ఇక్కడ సమస్యలెన్నో ఉన్నాయి. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, గంతులమయమైన రోడ్ల వంటి సమస్యలతో.. జనం విసిగి వేసారుతున్నారు. మొన్నటి వరదల సమయంలో పలు ప్రాంతాలు నీటి మునిగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల ఆర్ధిక సహాయం చాలా మందికి అందినా... తీవ్రంగా నష్టపోయాం అన్నది ఇక్కడి స్థానికుల ఆందోళన. వరదల సమయంలో స్థానిక రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు తమ వైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు.
జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో పెద్దగా ప్రాతనిధ్యంలో కనిపించని టీడీపీ కూడా ఇక్కడ ఆఫీసు తెరిచింది. టీఆర్ఎస్ అభ్యర్ధులు కూడా జోరుగా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల అటెన్షన్ తమ వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేశారు.