ఆయా డివిజన్లలో ఖర్చు కోట్లలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బరిలో నిలిచిన వారిలో అత్యధికులు రియల్టర్లు, ఇతరత్రా వ్యాపారాలు నిర్వహించుకునే వారే కావడం గమనార్హం. అందుకే గెలుపుకోసం కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడలేదని సమాచారం.టీఆర్ ఎస్-బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. చాలా డివిజన్లలో ఈ రెండు పార్టీల మధ్యే నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం సాగింది. ఇప్పుడు ఓటర్ల తీర్పు కూడా అలాగే ఉండబోతోందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి ఈసారి సైతం గణనీయ సంఖ్యలో సీట్లను గెలవాలనుకుంటోంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకునే దానిపై ధీమాతో ఉంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విజయంతో సమరోత్సాహంలో ఉంది. అయితే ప్రస్తుతం నగరంలోని 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్ మేయర్ పదవిని చెప్పాలి అంటే సంఖ్యాబలం 102 ఉండాలి. ఈ మ్యాజిక్ ఫిగర్ కోసం తెరాస, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాగైనా వందకు పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని రెండు పార్టీలు చెప్తున్నాయి.