ఇకపోతే ఏ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించని ప్రచార జోరు ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించిందని అంటున్నారు.. కాంగ్రెస్ కి ఇది జీవన్మరణ సమస్య కాగా, టీ ఆర్ ఎస్ కి పరువు సమస్య, బీజేపీ కి మాత్రం తప్పక గెలవాల్సిన ఎన్నిక ఇది.. అందుకే అన్ని పార్టీ తమవద్ద ఉన్న ప్రచారాస్త్రాలను గట్టిగా వాడుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 23 నుంచి 29 వరకు ప్రచార పర్వం కొనసాగింది. ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా అన్ని పార్టీల అధినేతలను రప్పించి నగర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.
బీజేపీ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వినియాదవ్, బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేంద్రయాదవ్ నగరంలో రోడ్షోలు నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. టీ ఆర్ ఎస్ లో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్యనాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్నికలను వేడెక్కించారు. కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి దామోదర్రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, అక్కడక్కడా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం చేశారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.