హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టాలనే అంశం కొద్ది రోజుల క్రితం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ట్వీటర్ యూజర్ చేసిన ట్వీట్‌తో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ బస్సులను నగరంలో మళ్లీ పరుగులు పెట్టించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని రవాణా మంత్రి పువ్వాడను అడిగారు. దీంతో బస్సులను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి పువ్వాడ సమాధానం ఇచ్చారు. నిజానికి డబుల్ డెక్కర్ బస్సులపై నగర వాసులు కూడా ఆసక్తిగా ఉన్నారు. దీనిపై రవాణాశాఖ అధికారులు సర్వే చేశారు. డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపించగలిగే 5 మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ మార్గాల్లో తొలుత 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడపాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు స్టేషన్లు రోడ్లకు తక్కువ ఎత్తులోనే ఉన్నందున అన్ని మార్గాల్లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరగటం సాధ్యం కాదు. ఇవి అడ్డురాని మార్గాల్లో మాత్రమే డబుల్ డెక్కర్ బస్సులను నడపాల్సి ఉంటుంది. తాజాగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు ఇబ్బంది లేని మార్గాలను గుర్తించారు.


నగరంలో 2004 వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహెదీపట్నం-సికింద్రాబాద్, మెహిదీపట్నం-చార్మినార్, సికింద్రాబాద్‌-చార్మినార్, సికింద్రాబాద్‌-జూపార్కు మార్గాల్లో నడిపారు. ఈ క్రమంలో మళ్లీ పటాన్‌ చెరుకు డబుల్ డెక్కర్ బస్సులను పంపాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్‌ చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఆ మార్గాల్లోనే వీటిని తిప్పితే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, మేడ్చల్‌ రూట్‌లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్‌శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త బస్సుల తయారీకి ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: