గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రతిష్టాత్మక అవార్డులను వెనక్కి ఇవ్వడం అనేది సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి అది ట్రెండింగ్ గా మారింది. రైతులకు మద్దతు ప్రకటిస్తూ పలువురు ప్రముఖులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ దిశగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ (92) మొదటి అడుగు వేశారు. ప్రభుత్వం నుంచి గతంలో తీసుకున్న పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. అన్నదాతలకు మద్దతుగా పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.


కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. జై కిసాన్ నినాదం మార్మోగుతోంది. రైతులకు మద్దతు పలుకుతూ పంజాబ్‌కు చెందిన పలువురు క్రీడా ప్రముఖులు కూడా తమ పురస్కారాలు వెనక్కి ఇచ్చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. శనివారం (డిసెంబర్ 5) ఢిల్లీకి వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు.


ఇక.. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ పద్మ విభూషణ్‌ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు 2015లో బహూకరించింది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి ఆకాలీదళ్ ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. ఆ పార్టీ నేత హర్‌సిమ్రన్ కౌర్ బాదల్.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం రైతుల పోరాటానికి మరింత బలం ఇచ్చింది. గతంలో మాజీ సైనికుల పోరాటం సందర్భంగా ‘అవార్డులను వెనక్కి ఇచ్చే అంశం’ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత తాజాగా రైతుల పోరాటం సందర్భంగా ఇది మరోసారి కీలక అస్త్రంగా మారింది. రైతులతో కేంద్ర మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. రైతు సంఘాల ప్రతినిధులతో రెండో రోజైన గురువారం చర్చలు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: