తరతరాలనుంచి రైతులకు అన్యాయం జరుగుతూనే వస్తుంది.. అన్ని వ్యవసాయ రంగాల్లో ని రైతుల చేతికి చిప్పనే ఇస్తున్నారు.. పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించి కోళ్ల రైతుల్ని ఏ రకంగా కూలీవాళ్లగా మార్చాయో చూస్తూనే వున్నాం. అదే విధంగా వందల వేల ఎకరాల అగ్రిఫామ్స్ వచ్చి చిన్న రైతులు లేకుండా చేయాలనే కుట్రకి పునాది ఎప్పుడో పడింది. వాల్మార్ట్లు , డీమార్ట్లు కిరాణా కొట్ల వాళ్లని దివాళా తీయించినట్టు, రైతుల మెడపై కత్తి పెట్టారు. రైతు ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చు అంటున్నారు, ఎక్కడ అమ్ముకుంటాడు? అన్ని మార్కెట్లను దళారీల గుప్పిట్లో పెట్టి , రైతులకి రహదారి ఏర్పాటు చేసినట్టు మాట్లాడుతున్నారు.
ఇక ఈ విషయాలని మీడియా ఎందుకు దాస్తుందో అర్థం కావట్లేదు.. రైతులు ఢిల్లీ ముట్టడి ప్రారంభమైనప్పటి నుంచి మన పత్రికల్ని గమనిస్తున్నాను. ఫస్ట్ పేజీలో వార్తలు వేస్తున్నారు తప్ప , అన్ని వేల మంది రైతులు చలిగాలిలో వణుకుతూ ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, వాళ్ల కష్టాలు, బాధలు వేసిన వాళ్లు లేరు. ఫొటో ఫీచర్ చేసిన వాళ్లు లేరు. ఇంగ్లీష్ పత్రికల్లో వేసే మూడు చిన్నచిన్న ఎడిటోరియల్స్లో కాసింత రైతుల కోసం కేటాయించారు. ఎడిట్ పేజీలో వ్యాసాలంటూ ఏవీ రాలేదు. తెలుగు పత్రికల్లో ఏదో ముక్తసరిగా రెండు వ్యాసాలు వచ్చాయి. నిజంగానే జర్నలిజం విలువలు రోజు రోజు కి తగ్గుతున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ..