ఇంటర్నెట్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అయితే బీజేపీ ఊహించని రీతిలో పుంజుకుని టీఆర్‌ఎస్‌కు ఝలక్ ఇచ్చింది. కానీ ఇన్నాళ్లూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను మాత్రం ప్రజలు ఏ మాత్రం ఆదరించలేదు. మొత్తం 150 స్థానాల్లో కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుని అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది. గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పూర్తిగా తన గుర్తింపు కోల్పోవడం.. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని గ్రేటర్ పరిధిలో ప్రధాన ప్రతిపక్షంగా మారడం దేశ వ్యాప్తంగా బీజేపీకి నూతన ఉత్తేజాన్ని అందించింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఈ రిజల్ట్‌పై బాలీవుడ్ నటి కంగన రనౌత్ కూడా ట్వీట్ చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించడం వైరల్ అవుతోంది. `ప్రియమైన కాంగ్రెస్..  మీ పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు `కంగన.. కంగన..` అంటూ నా నామజపం చేస్తూ గందరగోళం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంటూ.. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంద`ని ట్వీట్ చేసింది. అంటే ఈ ట్వీట్ ద్వారా ఆమె బీజేపీని ప్రశంసించడమే కాకుండా కాంగ్రెస్‌కు చురకలేసింది. ‘తనను నిందించడం మానేసి పార్టీ అభివృద్ధి పెట్టండి’ అనే విధంగా ఆమె ట్వీట్ సాగింది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుంచి కంగన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. బాలీవుడ్‌పై, మహారాష్ట్ర సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహా సర్కార్‌కు, కంగనకు పూర్తిగా చెడింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కూడ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: