గ్రేటర్ ఫలితాలపై కమలనాధుల సమీక్ష: ఎలా ముందుకు వెళ్లాలని అంతర్మధనం
గ్రేటర్ ఫలితాలపై అన్ని పార్టీల్లో అంతర్మధనం జరుగుతోంది. అనూహ్య ఫలితాలతో అన్ని పార్టీలను కంగు తినిపించిన ఓటర్ మేయర్ ఎంపికకు సంబంధించి చిక్కుముడిని వేసాడు. 55 డివిజన్ లలో టీఆరెస్, 48 డివిజన్లలో
బీజేపీ,44 డివిజన్లలో మజ్లీస్ అభ్యర్థులు గెలుపొందగా ఏ పార్టీకి మేయర్ పీఠం దక్కుతుందో అన్న సందేహం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న అంశం.
అతి పెద్ద
పార్టీ గా అవతరించిన గులాబీ పార్టీకి కూడా ఆ మేయర్ పదవి దక్కించుకోవడానికి అడ్డంకులు ఉండనే ఉన్నాయి. ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారం అందినా మేయర్ స్థానం చేజిక్కించుకోవడం కష్టమే. గతసారి గ్రేటర్ ఎన్నికల్లో 99 డివిజన్లను
తెరాస గెలుచుకోవడంతో మేయర్, డెప్యూటీ మేయర్ స్థానాలను అందుకోవడం సులువయింది. ప్రస్తుత సంఖ్య ప్రకారం మేయర్ స్థానాన్ని చేజిక్కించుకోవాలంటే 98 ఓట్లు అవసరం గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలసి
తెరాస కి 87 మంది ఉన్నారు.
కొత్తగా ఎన్నికయినా ఎంఎల్సీ లను కూడా కలుపుకున్న ఇంకో 7 ఓట్స్ అవసరమవుతాయి. ఈ లెక్కలు, పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్న
కమలం పార్టీ కూడా మేయర్ పదవి ని చేజిక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం గ్రేటర్ ఫలితాలు సమీక్షించేందుకు
బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కమిటీ ఫలితాలను సమీక్షిస్తోంది. సమావేశంలో
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు
లక్ష్మణ్,
ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఈ నాయకులంతా చర్చిస్తున్నారు.