జాతీయ స్థాయిలో వ్యవసాయ బిల్లులపై సమగ్ర చర్చ జరగాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులు, రైతుసంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలి అని ఆయన అన్నారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలి అన్నారు. ఈ బిల్లులపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలి అని ఆయన కేంద్రానికి సూచనలు చేసారు.  అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర డిబేట్ జరపాలి అన్నారు.  అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. రైతాంగానికి మేలైన విధానాలను తీసుకురావాలి అని సూచించారు.

సగటు భారతీయ రైతు అక్షరాస్యత, అవగాహనలతో పాటు, స్థానిక రైతు నిస్సహాయతను కూడా పరిగణించి చట్టాలను రూపొందించాలన్నారు. బిల్లులను హడావుడిగా ప్రవేశపెట్టి, తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు అని ఆయన పేర్కొన్నారు. సమగ్ర చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధనే సర్వత్రా మేలు. లేకపోతే ఇప్పటికే అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతన్నలపై మరింత భారం మోపే ప్రమాదం ఉంది అన్నారు. కనీస మద్దతు ధర పొందడం అనేది ఒక విధాన నిర్ణయంగానే కాకుండా రైతుకు చట్టబద్దమైన హక్కుగా ఉండాలన్నారు. ఎంఎస్ పి పొందడం అనేది కొందరి దయాదాక్షిణ్యాల మీద  ఆధారపడి ఉండరాదు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని ఆయన సూచించారు.
 
రైతు నిస్సహాయతను తమ లాభాల కోసం వాడుకునే వ్యవస్థలను, వ్యక్తులను ప్రోత్సహించరాదు అని, ఆత్మవిశ్వాసం భారతీయ రైతన్నల ఆత్మగౌరవం అన్నారు. తమ కృషిపై, ప్రకృతిపై, ప్రభుత్వంపై మన రైతన్నల్లో తొణికిసలాడే విశ్వాసాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వారి స్వతంత్రతను, మనో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడటం పాలకుల ధర్మం అని,  రైతాంగ ప్రయోజన విధానాలతోనే  వారి విశ్వాసాన్ని ఇనుమడింప చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది అన్నారు. 22మంది ఎంపిలు ఉండి లోక్ సభలో  వైసిపి నోరు తెరవక పోవడం రైతుద్రోహం అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: