ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సీన్ల తయారీదారు భారత్‌. అయితే... ఇప్పుడు అతిపెద్ద కరోనా వ్యాక్సీన్‌ వినియోగదారుగా మారబోతోంది ఇండియా. ఏకంగా 160 కోట్ల కరోనా వ్యాక్సీన్‌ డోసుల్ని కొనబోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. పలు దేశాల్లో తగ్గినట్టే తగ్గి... మళ్లీ పంజా విసురుతోంది. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సీన్‌ సిద్ధ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. దిగ్గజ ఔషధ తయారీ సంస్థలు, ప్రభుత్వాల భాగస్వామ్యంలో వ్యాక్సీన్లు సిద్ధమవుతున్నాయి.

బ్రిటన్‌, అమెరికా, రష్యాలతో పాటు భారత్‌లో తయారైన పలు వ్యాక్సీన్లకు ప్రస్తుతం తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సీన్ల అతి పెద్ద వినియోగదారుగా అవతరించబోతోంది భారత్‌. భారత్‌ 160 కోట్ల డోసుల కరోనా వ్యాక్సీన్‌ కొనుగోలు చేయబోతోందని అమెరికాకు చెందిన డ్యూక్‌ యూనివర్సిటీ అంచనా వేస్తోంది. లాంచ్ అండ్ స్కేల్ స్పీడో మీటర్ పేరిట సిద్ధం చేసిన నివేదిక ప్రకారం... అత్యధిక డోసులు కొన్న దేశం కాబోతోంది భారత్. ఆ తర్వాత స్థానంలో యూరోపియన్, అమెరికా నిలిచాయి. అమెరికా వంద కోట్ల డోసులు కొనబోతున్నట్టు తెలుస్తోంది.

వివిధ వ్యాక్సీన్‌ ఉత్పత్తి సంస్థలతో ఇప్పటికే భారత్ ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంది. మన దేశంలో గల మౌలిక సదుపాయాలను వ్యాక్సీల తయారీకి ఉపయోగించుకోవడంతో పాటు... డోసుల్లో కొంత మొత్తాన్ని భారత్‌కు విక్రయించేందుకు పలు సంస్థలు అంగీకరించాయి. మరోవైపు... వివిధ సంస్థలు చేపట్టిన వ్యాక్సీన్ల క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశలో ఉన్నాయి. మెరుగైన ఫలితాలు సాధించిన వ్యాక్సీన్లను ప్రజలకు పంపిణీ చేయడానికి మోడీ సర్కార్‌ సిద్ధమైంది. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సీన్లు కావడంతో వాటి సేకరణలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు.  

ప్రపంచ వ్యాప్తంగా ఇంత వరకూ 15 లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా కరోనా విజృంభించింది. ఒకానొక దశలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. అయితే, తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం రోజువారీగా నమోదువుతున్న కేసుల సంఖ్య 40 వేలకు దిగువన ఉన్నా, కొన్ని చోట్ల వైరస్‌ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కరోనాను ఎదుర్కోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. లాక్‌డౌన్‌లు విధించడంతో పాటు ప్రజల రోజువారీ కార్యకలాపాలపైనా ఆంక్షలు విధిస్తున్నాయి. అనేక దేశాల్లో ఇంటి గడప దాటి బయటకు రావాలంటే మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. నిబంధనల్ని ఉల్లంఘించిన వాళ్లకు భారీగా ఫైన్లు వేస్తున్నాయి. ఇంత చేస్తున్నా... వైరస్‌ వ్యాప్తి కొనగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేవలం వ్యాక్సీన్‌తోనే కరోనాను కట్టడి చేయగలమనే అభిప్రాయానికి వచ్చేశారు చాలా దేశాల అధినేతలు. ఈ క్రమంలోనే ధనిక, పేద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వ్యాక్సీన్లు కొంటున్నాయి వివిధ దేశాలు. కెనడా, బ్రిటన్‌ ఇప్పటికే 400 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లను కొన్నాయి. కాగా, 2024 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్‌ పంపిణీ జరిగే అవాకాశముంది.












మరింత సమాచారం తెలుసుకోండి: