అఖిల ప్రియ చెప్పిన సమాచారం ఆధారంగా యూసుఫ్ గూడ ఎంజీఎం స్కూల్, కూకట్పల్లి హోటల్లో పలు ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. అయితే.. మొదట్లో అఖిల ప్రియ నోరు విప్పలేదట. అసలు చంద్రహాస్, మాదాల శ్రీను ఎవరో తనకు తెలియదని చెప్పిందట. అయితే పోలీసులు ఆమె ఫోన్ ట్రాక్ రికార్డును.. ఆమె సీక్రెట్ నెంబర్ ఫోన్ రికార్డు ట్రాకులను ఆమెకు చూపించి.. ప్రశ్నించేసరికి ఆమె నోరు విప్పక తప్పలేదట.
ఆమె చెప్పిన కథనం ప్రకారం.. ఎంజీఎం స్కూల్లో భార్గవ్, చంద్రహాస్ కిడ్నాపర్లతో భేటీ అయ్యారట. కూకట్పల్లిలోని హోటల్లో మాదాల శ్రీనుతో భార్గవ్ భేటీ అయ్యాడట. ఎంజీఎం స్కూల్లోనే కిడ్నాపర్లకు గ్యాంగ్ సినిమా చూపించారట. ఆ తర్వాత కిడ్నాప్ స్కెచ్ వేశాడట భార్గవ్ రామ్. ఇక కిడ్నాప్ సమయంలో బోయినపల్లి వరకూ భార్గవ్ కారులోనే వెళాడట. కిడ్నాప్ పూర్తయిన తర్వాత భార్గవ్ రామ్ మొయినాబాద్ ఫామ్హౌస్ చేరుకున్నాడట. అక్కడే ప్రవీణ్, నవీన్ లతో భార్గవ్రామ్ సంతకాలు చేయించారట.
ఈ కిడ్నాప్ ఘటనలో మొత్తం 15 మందికిపైగా పాల్గొన్నారట. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే.. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇప్పటికే పోలీసులకు దొరికిపోయాడని.. ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో గుట్లన్నీ విప్పేశాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు భార్గవరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఓ ప్రముఖ పత్రిక రాసింది.