అయితే ఏపీలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు, వైసీపీ ప్రభుత్వానికి పెద్దగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. గత ఏడాదిగా వీరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా నిమ్మగడ్డ, పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే దీనికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అలాగే హైకోర్టుకు వెళ్లింది. కోర్టు కూడా పంచాయితీ ఎన్నికల నిర్వహణకు నో చెప్పింది. అయితే దీనిపై నిమ్మగడ్డ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాను రిటైర్ అయ్యేలోపు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ చూస్తున్నారు. అటు నిమ్మగడ్డ వెళ్లాకే ఎన్నికలు పెట్టుకోవాలని వైసీపీ చూస్తుంది. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్, ఏపీ ప్రభుత్వాలు పంతంతోనే ఉన్నాయి. ఇదే సమయంలో వీరి రచ్చపై న్యూట్రల్గా ఉండే రాజకీయ పరిశీలకుల నుంచి పలు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. రెండు నెలల్లో రిటైర్ అయ్యే నిమ్మగడ్డ ఇలా మొండిగా ఎన్నికలు నిర్వహించాలని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం సహకారం లేకుండా ఏమి సాధిద్దామని అనుకుంటున్నారో అర్ధం కావడం లేదంటున్నారు. అలాగే ఎన్నికలు పెడుతుంటే వైసీపీకి భయం ఏంటో తెలియడం లేదని, అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుందని, పైగా ప్రజల మద్ధతు ఉందని అనుకుంటే ఎన్నికలు పెడుతుంటే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నిమ్మగడ్డ వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని, అలాగే టీడీపీకి కలిసొచ్చేది ఏమి లేదని అంటున్నారు.