ఇక ఇదే కేసులో మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న అఖిల ప్రియ కస్టడీ సమయం ముగిసింది. దీంతో ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కస్టడీ ముగిసిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జడ్జి ఎదుట హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించడంతో అఖిల ప్రియను చంచల్ గూడ జైలుకు తరలించారు.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా కుటుంబ సభ్యుల పాత్ర దిశగా పోలీసుల దర్యాప్తు సాగించారు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు తొలుత పోలీసులు అనుమానం వ్యక్తపరిచారు. కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు కిడ్నాపర్లతో జగత్ మాట్లాడినట్లు అనుమానాలు ఉన్నాయి. అఖిల ప్రియ అరెస్ట్ సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని పోలీసులు విచారించారు. అయితే అతనిపై అప్పుడు అనుమానాలు లేకపోవడంతో కొన్ని వివరాలు మాత్రం సేకరించి వదిలేశారు. తాజాగా జగత్ విఖ్యాత్ డ్రైవర్ చెప్పిన ఆధారాలతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.