ఇంటర్నెట్ డెస్క్: హిందీ భాష మాధ్యమంగా ఉండాలంటూ విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. తాము చదువుతున్న యూనివర్సిటీ పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదంతా మనదేశంలో కాదు. దక్షిణ కొరియాలో. అవును.. దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్సిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ యూనివర్శిటీలో హిందీ మాధ్యమాన్ని తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై అక్కడి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందీ భాష అధ్యయనానికి సంబంధించిన కోర్సును తొలగించద్దొంటూ యూనివర్శిటీని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా సియోల్‌లోని భారత ఎంబసీకి కూడా విద్యార్థులు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్శిటీ, హాన్‌కుక్ యూనివర్శిటీలు మాత్రమే ఇప్పటివరకు హిందీ భాష అధ్యయనానికి అవకాశం కల్పిస్తున్నాయి. దక్షిణ కొరియాలో తొలిసారి హిందీ మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన యూనివర్సిటీ హాన్‌కుక్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ 1972 నుంచి హిందీ భాషపై ప్రత్యేక కోర్సులను అందిస్తోంది. ఆ తరువాత 1983లో బూసాన్ విశ్వవిద్యాలయంలో కూడా హిందీ భాష కోసం ఇండియన్ స్టడీస్ విభాగం ఏర్పాటు చేశారు. అయితే కొద్ది వారాల క్రితం బూసాన్ యూనివర్సిటీలోని ఇండియన్ స్టడీస్ విభాగం కీలక ప్రకటన చేసింది.

హిందీ భాషకు సంబంధించిన కోర్సులకు ముగింపు పలికే యోచనలో ఉన్నట్లు ఆ ప్రకటన ద్వారా యూనివర్శిటీ తెలియజేసింది. భారత్‌లో పనిచేయాలనుకునే దక్షిణకొరియా వారికి ఇంగ్లీష్ వస్తే సరిపోతుందని కూడా పేర్కొంది. అయితే హిందీ భాష కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో ఈ ప్రకటన పెద్ద ఎత్తున కలకలం సృష్టంచింది. ఈ క్రమంలో వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తమ నిరసల వ్యక్తం చేస్తున్నారు.

మరికొంతమందైతే హిందీ భాషపై ఆసక్తిగల విద్యార్థులు సియోల్‌లోని భారత ఎంబసీకి, ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలకు కృషి చేసే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌కు ఈ విషయమై నేరుగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన ఆవేదన తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: