ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే చైనాకు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా సహనాన్ని పరీక్షించొద్దని పొరుగు దేశాన్ని హెచ్చరించారు. తూర్పు లడఖ్‌ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో నరవాణే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిని చర్చల ద్వారా చక్కదిద్దడానికి తాము కట్టుబడి ఉన్నామని కానీ.. భారత్ సహనాన్ని ఎవరూ పరీక్షించొద్దని ఆయన హెచ్చరించారు. ‘చర్చలు, రాజకీయ మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ భారత్ సహనాన్ని పరీక్షించే తప్పిదం ఎవరూ చేయొద్దు’ అని ఢిల్లీ కంటోన్మెంట్‌లో నిర్వహించిన కస్టమరీ ఆర్మీ డే పరేడ్ సందర్భంగా నరవాణే ఈ వ్యాఖ్యలు చేశారు.

 


లడఖ్‌లో ఇరు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకొని 9 నెలలు అవుతోంది. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా సైనిక, దౌత్య చర్చలు జరిగినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నార్తర్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన బీఎస్ జశ్వాల్ తెలిపారు. లడఖ్‌లో ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చడానికి జరిగిన కుట్రలకు తాము గట్టిగా బదులిచ్చామని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ, చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన లక్షల మందికిపైగా సైనికులు అధునాత యుద్ధసామాగ్రిని మోహరించిన సంగతి తెలిసిందే.




జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో అమరులైన భారత సైనికుల త్యాగాలు వృథాగా పోవని నరవాణే తెలిపారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలో మరణించినప్పటికీ.. డ్రాగన్ ఎంత మంది చనిపోయారనే విషయాలను వెల్లడించలేదు. లడఖ్ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల ధైర్యం విపత్కర పరిస్థితుల్లో వారు రక్షిస్తోన్న పర్వతాల కంటే ఎత్తుగా ఉందని నరవాణే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో 300-400 టెర్రరిస్టులు ఉన్నారని.. వీరంతా భారత్‌లోకి చొరబడేందుకు ఎదురు చూస్తున్నారని ఆర్మీ చీఫ్ తెలిపారు. 2019తో పోలిస్తే 2020లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని 44 శాతం ఎక్కువగా ఉల్లంఘించిందని నరవాణే తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: