ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.. అతి త్వరలోనే అమెరికాకు కొత్త అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టనుండగా.. ఈ సందర్భంలో అగ్రరాజ్యం అమెరికాను తమ‌ దేశ ప్రధాన శత్రువుగా కిమ్ ప్ర‌క‌ట‌ించడం గమనార్హం. గురువారం రాత్రి కొత్త‌గా ఆవిష్కరించిన సబ్‌మెరైన్‌ లాంచ్‌ బాలిస్టిక్‌ క్షిపణుల ప్రదర్శనని తిలకించిన కిమ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. యుఎస్‌ను తమ శత్రువుగా అభివర్ణించారు. ఆసియా ప్రత్యర్థులు, అమెరికాకు వ్యతిరరేకంగా తన అణు, క్షిపణి కార్యక్రమాన్ని పెంచడానికి గరిష్ట ప్రయత్నాలు చేస్తానని కిమ్ ప్రతిజ్ఞ చేశాడు. త‌మ‌ భూభాగం వెలుపల ముందస్తుగా శత్రువులను గుర్తించి, వారిని పూర్తిగా నాశనం చేసే శక్తిమంతమైన రాకెట్లు త‌మ వ‌ద్ద ఉన్నాయని ఈ సంద‌ర్భంగా ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. సరిహ‌ద్దుల వెలుపల సుదూర ల‌క్ష్యాల‌నూ ఈ రాకెట్లు నాశనం చేస్తాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసిన‌ట్లు తెలిపింది. అలాగే, నీటి అడుగున పలు ఎస్‌ఎల్‌బీఎంలను పరీక్షించిన‌ట్లు వివరించింది. అణు జలాంతర్గామిని అభివృద్ధి చేయడానికి ఉత్త‌ర‌ కొరియా ప్రయత్నిస్తోందని అధికారిక మీడియా వెల్లడించింది.



అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణపై ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ, ఉత్త‌ర‌ కొరియా గతంలో అభివృద్ధి చేసిన‌ పుక్‌గుక్సాంగ్-4 కు అత్యాధునిక సాంకేతికతను జోడించింది. అంతర్జాతీయ సమాజం ఆంక్షల తర్వాత తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయినా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించడానికి అంతగా ఆసక్తి చూపలేదు. అణ్వాయుధీకరణ కిమ్‌ తొమ్మిదేళ్ల పాలనలో క్లిష్టమైన చర్యలు ఏమిటో స్పష్టంగా తెలియజేశాయి. ఇదిలా ఉండగా.. గతంలో ఉత్తర కొరియా అధినేతను ‘దుండగుడు’ అని జో బిడెన్ అభివర్ణించడంతో ఆయనను ఒత్తిడిలో నెట్టేందుకు కిమ్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా అణ్వాయుధీకరణలను అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యారని బైడెన్ ఆరోపించారు. చర్చలను కిమ్ తోసిపుచ్చలేదు, కానీ, అమెరికా పట్ల శత్రు విధానాన్ని విరమించుకుంటారా అనేది ద్వైపాక్షిక సంబంధాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. నల్ల రంగు టోపీ, లెదర్ కోటు ధరించి, చిరు దరహాసంతో కిమ్ ఇల్ సుంగ్ స్క్యేర్ వద్ద పోడియం నుంచి సైనికులకు అభివాదం చేస్తున్న ఫోటోలను కేసీఎన్ఏ విడుదల చేసింది. జలాంతర్గామిపై నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులతో సహా దేశంలోని అధునాతన వ్యూహాత్మక ఆయుధాలను తయారు చేయడంతో ప్రజలు గర్జించారని ఏజెన్సీ తెలిపింది. కొత్తగా అభివృద్ధి చెందిన జలాంతర్గామి బాలిస్టిక్ క్షిపణులు, గతంలో పరీక్షించిన ఆయుధ వ్యవస్థలను రవాణా చేసే ట్రక్కుల ఫోటోలు ఇందులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: