చంద్రబాబు తన స్వార్థం కోసం మూడు, నాలుగు పంటలు పండే అమరావతి రైతుల భూములు లాక్కుని మోసం చేశారని నందిగం సురేష్ ఆరోపించారు. చంద్రబాబుకు ఐదేళ్ళు అధికారం ఇస్తే.. రాజధాని పేరుతో గ్రాఫిక్స్, డిజైన్స్ చూపించి రైతులను వంచించారని విమర్శించారు. ఇటువంటి చంద్రబాబు సంక్రాంతికి పంచె కట్టి, తానూ రైతునంటే నమ్మటానికి ఏ ఒక్క రైతూ సిద్ధంగా లేడని నందిగం సురేష్ తేల్చి చెప్పారు. రైతు అన్న పదం పలకటానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదన్నారు. ఆ పదం పలకాలంటే.. రైతుల మేలు కోసం, వారి సంక్షేమం కోసం పని చేసిన నాయకుడై ఉండాలి తప్పితే.. చంద్రబాబు నాయుడులా రైతులను ఏడిపించే వారిలా ఉండకూడదని స్పష్టం చేశారు. కరెంటు చార్జీలు కట్టకపోతే రైతులను జైళ్ళల్లో పెట్టించి, ప్రత్యేక కోర్టులు పెట్టి శిక్షలు వేయించిన చంద్రబాబును ఏ ఒక్కరైనా రైతు అంటారా..? రైతు ద్రోహి అంటారా..? అని ప్రశ్నించారు.
అమరావతి ప్రాంతంలో 54 వేల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైతే.. కోర్టులకు వెళ్ళి ఎందుకు అడ్డుకున్నారు..? అంటే వాళ్ళల్లో దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదలు ఉన్నారే కదా..? పేద ప్రజలకు పట్టాలు ఇస్తే.. అక్కడ డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందని మీరు కోర్టుల్లో వాదించింది నిజం కాదా..? అంటూ ఎంపీ నిలదీశారు.
రెండు పత్రికలు, మూడు టీవీ ఛానళ్ళు వంద రోజులు, రెండు వందల రోజులు, మూడొందలు, నాలుగొందలు.. అని ఊదరగొట్టినంత మాత్రాన రైతులు ఎవరు?, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎవరు?, చంద్రబాబు బినామీలు ఎవరు? అన్న సత్యాన్ని సమాధి చేయలేరన్నారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు ద్రోహిగానే చరిత్రలో మిగిలిపోతారు.. రైతులపై మొసలి కన్నీళ్ళు కార్చినంత మాత్రాన చంద్రబాబును ఎవరూ నమ్మరని ఎంపీ నందిగం సురేష్ కరాఖండీగా చెప్పారు.