భారత దేశానికి పక్కలో రెండు బల్లేలు.. ఒకటి పాకిస్తాన్ అయితే మరొకటి చైనా అన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో శత్రుత్వంపై మనకు పిచ్చ క్లారిటీ ఉంది.. పాక్ బలాలు బలహీనతలు అన్నీ తెలుసు. పైగా పాకిస్తాన్‌ మనకంటే అనేక విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. పాక్ కంటే భారత్ ఎన్నో రెట్లు బలమైంది. అందువల్ల పాక్ విషయంలో పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. కానీ చైనా సంగతి అలా కాదు. చైనా మనకంటే అన్ని విషయాల్లోనూ బలమైందే. చివరకు జనాభాలో కూడా. టెక్నాలజీ, ఆర్థికం, సైనికం.. ఇలా ఏ కోణంలో చూసినా ఇండియా చైనా ముందు బలహీనమైందే.

అలాగని ఎన్నాళ్లు చైనాకు భయపడిబతుకుతాం.. చైనా ను దెబ్బ కొట్టే మార్గాలే లేవా.. అందులోనూ వాడు పదే పదే సరిహద్దుల్లో కవ్విస్తుంటే.. మన భూబాగంలోకి చొచ్చుకొస్తుంటే.. చూస్తూ కూర్చోవడమేనా.. అందుకే ఇండియా అన్ని శక్తులూ కూడదీసుకుంటోంది.. దెబ్బకు దెబ్బ తీసేందుకు రెడీ అవుతోంది. ఇందుకు ఉదాహరణ.. ఆ మధ్య జరిగిన గాల్వన్ ఘటన.. తాజాగా..  ఆర్మీ డే సందర్భంగా దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌..జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె చైనాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు తమ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదని.. భారత సైన్యం సహనాన్ని పరీక్షించడానికి ఎవ్వరూ ప్రయత్నించొద్దని హెచ్చరించారు. సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు చైనా యత్నించిందని..ఈ సమయంలో చైనాకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందన్నారు. గాల్వన్‌ ఘటనలో అమరులైన 20మంది భారత సైనికుల త్యాగాలు ఎన్నటికీ వృథా కావని  స్పష్టంచేశారు.  

చైనాతో స్నేహానికి సిద్ధం.. కాదని కయ్యం కోరుకుంటే వెనుకడుగు వేయం అని చెప్పకనే చెప్పారు నరవణే. గత సంవత్సరం భారత సైన్యానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని నరవణె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: