ఉదయం 11.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్ బయల్దేరి వెళ్తారు. 11.25 గంటలకు విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్)కి సీఎం చేరుకుంటారు. అనంతరం మొదటివిడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు జగన్. ఇక ఇదిలా ఉంటే... గుంటూరు జిల్లాలో కరోనా టీకా పంపిణీకి 31 కేంద్రాలు ఏర్పాటు చేసారు. టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ ని అధికారులు తరలించారు. తొలిరోజున జిల్లావ్యాప్తంగా 2వేల 466 మందికి టీకా అందిస్తారు అధికారులు.
వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు రెండు కమిటీలు ఏర్పాటు చేసారు. కో విన్ యాప్ లో సమాచారం అప్ లోడ్ పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. జీజీహెచ్ లో టీకా కార్యక్రమం ప్రారంభంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కూడా పాల్గొంటారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా టీకా కార్యక్రమం ప్రారంభం ఉంటుంది. ఇక అనంతపురం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసారు. జిల్లాకు 35500 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరాయి. మొదటి విడతలో 30, 747 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందిస్తారు. వ్యాక్సిన్ కు దూరంగా గర్భిణి స్త్రీలు, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఉన్నారు.