వాట్సాప్‌ విడుదల చేసిన కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్లు భగ్గుమంటున్నారు. మా సమాచారమే మీ పెట్టుబడా..? అంటూ మండిపడుతున్నారు. ఫిబ్రవరి 8 లోపు ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పాలని అల్టిమేటం ఇవ్వడంతో యూజర్లు వాట్సాప్‌ను వదిలిపోతున్నారు. ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. దీంతో కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌తో వ్యక్తిగత సమాచార భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. మన డేటాను అంగట్లో సరుకుగా మార్చేసిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చింది వాట్సాప్‌. ప్రైవసీ విషయంలో ఎలాంటి రాజీ లేదంది. స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపే మెసేజ్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పింది. మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ డేటా భద్రంగా ఉంటుందని తెలిపింది.  

వాట్సాప్‌ ఎట్టి పరిస్థితుల్లో యూజర్ల మెసేజ్‌లను చదవదని.. వాయిస్‌ కాల్స్‌ వినదని ప్రకటనలో తెలిపింది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో సందేశాలు భద్రంగా ఉంటాయని వెల్లడించింది. అంతేకాదు.. మరిన్ని అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎఫ్‌ఏక్యూ పేజీని విడుదల చేసింది వాట్సాప్‌.

యూజర్‌ కమ్యూనికేషన్‌కి సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర ఉండదని వెల్లడించింది. అంతేకాదు.. యూజర్ల ఫోన్‌ నెంబర్లను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర యాప్‌లకు చేరవేస్తారన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది. వాట్సాప్‌లో గ్రూప్‌ చాట్‌ పూర్తి భద్రతతో కూడకున్నదని స్పష్టం చేసింది. లోకేషన్‌ను కూడా వాట్సాప్‌ ట్రాక్‌ చేయదని క్లారిటీ ఇచ్చింది.

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదంటూ.. వినియోగదారులు వాట్సాప్‌ను వీడుతున్నారు. ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. మొత్తానికి వాట్సప్ విడుదల చేసిన కొత్త ప్రైవేట్ పాలసీపై యూజర్లు మండిపడుతున్నారు. మా ఇన్ ఫర్మేషన్ తో మీరు బిజినెస్ చేస్తారా అని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పైగా ఫిబ్రవరి 8లోపు పాలసీకి అగ్రీ కావాలని అల్టిమేటం ఇవ్వడంతో యూజర్లు వాట్సాప్ కు గుడ్ బై చెబుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: