కొవిడ్ 19 వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో.. రెండో డోసు కూడా అదే రకం టీకా తీసుకోవాలి. యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు, ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కొవిడ్ టీకా ఇవ్వాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై ఇప్పటివరకు కొవిడ్ టీకా క్లినికల్ పరీక్షలు జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కొవిడ్ టీకాకు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.
టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1075 టోల్ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధమైన నియమ, నిబంధనలు అనుసరించే రూల్ బుక్ ను రాష్ర్టాలు పాటించాలి.