ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఆంధ్రప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించారు. ముందు నుంచి ప్రభుత్వం చెబుతున్నట్లుగానే వ్యాక్సిన్ ను పారిశుద్ద్య కార్మికులకే అందించారు. కరోనా విజృభించిన కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పాటుపడిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అదే మాటకు కట్టుబడి ఏపీలో తొలి వ్యాక్సిన్‌ను పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి వేశారు. విజయవాడలో సర్వజనాసుపత్రిలో ప్రారంభమైన టీకా కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముందుగా వ్యాక్సినేషన్‌  ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. వాలంటరీ గా ముందుకు వచ్చి పుష్పకుమారి వాక్సిన్ వేయించుకున్నార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అనంతరం హెల్త్ వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు.
                              రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు.
                                                మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: