ఆలయాలపై దాడుల ఘటనలో నిందితుల వివరాలు భయటకు వచ్చేసరికి టీడీపీ నేతల్లో భయం మొదలైందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. కొన్ని ఘటనల్లో టీడీపీ, బీజేపీ ప్రమేయం ఉన్నట్టు పోలీసు పరిశోధనలో తేలినట్లు డీజీపీ సవాంగ్ వెల్లడించారని చెప్పారు. తమ ఉనికి కోల్పోతున్నామనే భయంతోనే కొందరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మంత్రి మండిపడ్డారు. దాడులకు సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు. దేవాలయ ఘటనలతో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేస్తామని అనిల్ చెప్పారు. పోలీస్ యంత్రాంగం నిజాయితీతో కూడిన పరిశోదన చేస్తుందని.. పోలీసు పని తీరుపై ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని అనిల్ కుమార్ తెలిపారు.
                                  ఆలయాలపై దాడుల ఘటనలోని తొమ్మిది కేసుల్లో ఉన్నది టీడీపీ కార్యకర్తలు కాదని చంద్రబాబుకు చెప్పే ధైర్యం ఉందా..? అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ప్రతి కేసులో మూలాలు తీసుకుంటే టీడీపీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ పరిశోదన తర్వాత ఎవరు చేయించారు అనే అసలు వాస్తవాలు కూడా బయటకి వస్తాయని మంత్రి అనిల్ అన్నారు. ఒక పాస్టర్‌కి సంబంచిన ఘటన రెండేళ్ల క్రితం జరిగిందని.. దాన్ని ఇప్పుడు జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
                              క్షుద్రపూజలు చేసే చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్ కు దేవుడంటే భక్తి, ప్రజలంటే గౌరవం ఉందని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి దానిని రాజకీయంగా ఉపయోగించుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తున్నారని.. వాళ్లకు సరైన సమయంలో బుద్ధి చెబుతారని మంత్రి అనిల్ అన్నారు. సీఎం జగన్ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని.. కుల, మత రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని కొనియాడారు.ప్రాభల్యం కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వారి సంగతి త్వరలోనే తేలుతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: