2019 ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్ వల్లే గెలిచారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన బొమ్మ ఉండటం వల్లే భారీ భారీ మెజారిటీలతో టీడీపీ నేతలని మట్టికరిపించారు. అయితే అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిపోయింది. ఈ 20 నెలల కాలంలో కొందరి ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని విశ్లేషకులు అంటున్నారు. స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కరించడంలో, ప్రజలకు సాయం చేసే విషయంలో వెనుకబడి ఉన్నారని చెబుతున్నారు.
ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ శ్రీరామరక్షగా ఉందని తెలుస్తోంది. జగన్ అందించే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతున్నాయి. అలాగే ఇళ్ల పట్టాల కార్యక్రమం వైసీపీ మైలేజ్ పెంచేలా ఉంది. అందుకే ప్రజలు కూడా జగన్ డబ్బులు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కట్టిస్తున్నారని చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యేల ఊసు ఎత్తడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రజలు జగన్ని చూసే ఓటు వేస్తారని అర్ధమవుతుంది.
ఒకవేళ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఓట్లు వేస్తే, వైసీపీకి ఇబ్బంది తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరు బాగోని చోట, టీడీపీ నేతలు దూకుడుగా ఉంటే, అది ఇంకా డ్యామేజ్ అయ్యేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ జగన్ బొమ్మ ఉంటే, ఎమ్మెల్యేలకు గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ ఇమేజ్ ఏ మేర వర్కౌట్ అవుతుందో.