ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీలోకి వెళ్తారని విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని అలాగే బీజేపీ నుంచి ఆయన కేంద్రమంత్రిగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజ్యసభ నుంచి ఆయన ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. త్వరలో కర్ణాటకలో రాజ్యసభ ఎంపీ సీటుకి ఎన్నిక జరుగుతుంది. అందుకు గానూ... బిజెపి నుంచి గంటా శ్రీనివాసరావుని పంపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.
అయినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం స్పందించడం లేదు. గంటా శ్రీనివాసరావు వస్తే కాపు సామాజిక వర్గం కూడా విశాఖ జిల్లాలో ఆ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీజేపీ నేతలు ఆయన కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నట్టు ఈ మధ్య కాలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి గంటా శ్రీనివాసరావు దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనతో చర్చలు జరపడానికి ఎవరు రావడం లేదు. అయ్యన్నపాత్రుడు కారణంగా రావడం లేదని అంటున్నారు. ఆయనకు గంటాతో విభేదాలు ఉన్నాయి. అందుకే టీడీపీ నేతలు అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.