లక్నో: భారతదేశం త్వరలోనే స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఎగుమతి ప్రారంభిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. లక్నోలో కొత్తగా నిర్మించనున్న సెంట్రల్ కమాండ్ హాస్పిటల్‌కు శనివారం నాడు ఆచన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా పాల్గొన్నారు.

'రెండు స్వదేవీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని కూడా త్వరలోనే వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభించాలని అనుకుంటున్నాం. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అనే సిద్ధాంతాలను భారత్ బలంగా నమ్ముతుంది. అశోక చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి వరకూ మనుషులతో పాటు సర్వ జంతుజాలం పట్ల మనం కరుణ చూపిస్తూనే ఉన్నాం. ఆ రకంగా మనం ప్రతి ఒక్కరికీ సహాయపడాలనే భావిస్తాం' అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కొవిడ్ మహమ్మారితో ఒక్క రోజులోనే రైళ్లు, విమానాలు, మార్కెట్లు, స్కూళ్లు, కార్యాలయాలతో పాటు ప్రతీదీ మూతపడతాయని ఏ ఒక్కరూ ఊహించలేదని, అయితే మన ప్రధాని ఈ పరిణామాన్ని ఒక సవాలుగా తీసుకుని కరోనా మహమ్మారిని సమర్ధవంతగా ఎదుర్కొనేందుకు ప్రతి వారం రెండు మూడు సమావేశాలు జరిపారని గుర్తుచేశారు.

ఈ ఇన్‌ఫెక్షన్‌ను పరీక్షించే సామర్ధ్యం దేశంలో కేవలం రెండే లేబొరేటరీలకు ఉందని, పీపీఈ కిట్ల కొరత, వెంటిలేటర్లు, మాస్కు‌ల కొరత కూడా సవాలు విసిరాయని, అయితే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మెడికల్ సేఫ్టీ కిట్లు ఎగుమతి చేయగలిగే స్థితికి మనం వచ్చామని ఆయన గర్వంగా చెప్పారు. ఈ రోజు దేశంలో 1000 లేబొరేటరీలు ఉన్నాయంటే, ఇదేమంత చిన్న విషయం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు వ్యాక్సిన్‌ను కూడా త్వరలోనే ఎగుమతి చేసే సత్తా భారత్‌కు ఉందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: