ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనల విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనల్లో కొన్నిటిలో తెలుగుదేశం, బీజేపీ పార్టీల నేతల పాత్ర ప్రమేయాన్ని గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. నాలుగు నెలలుగా వరుసగా దేవాలయాలపై దాడుల ఘటనపై కేసులు నమోదు అవుతున్నాయి. దాడులు చెయ్యడమే కాకుండా అసత్య ప్రచారం కూడా చేస్తున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వరుసగా విగ్రహాలు ధ్వంసం చేయడంతో పాటు తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న పోలీసులు.. ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు.
రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే తెలుగుదేశం బీజేపీ నాయకులు విగ్రహాల ధ్వంసం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు చెబుతున్నారు. విగ్రహాల ధ్వంసం, తప్పుడు ప్రచారానికి సంబంధించి తెలుగుదేశం, బీజేపీనేతల ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు.