తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పని తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారులే చెబుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు ఫోన్లు మాట్లాడటానికే బయపడిన ఉన్నతాధికారులు ఇప్పుడు నిర్భయంగా మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ అధికారులు,  ప్రజల్లో వచ్చిన మార్పు బీజేపీకే అనుకూలమన్నారు కిషన్ రెడ్డి.  సీఎం కేసీఆర్‌కు నీతి లేదు.. నిలకడ అస్సలే లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అమెరికా ట్రంప్‌కు.. కేసీఆర్, కేటీఆర్‌కు తేడా ఏమీ లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తుగా  ఓడిన అభ్యర్థులతో కలిసి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.ఎంఐఎంతో అక్రమ పొత్తు లేకుంటే టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేయకుంటే గ్రేటర్ ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు కిషన్ రెడ్డి. 

   సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి.. తెలంగాణలో పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందన్న కిషన్ రెడ్డి... కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.రానున్న రెండేళ్లు తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమన్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదన్నారు కేంద్ర మంత్రి. వరద బాధితులకు సాయాన్ని నిలిపివేయటం దుర్మార్గమన్నారు. ఉచిత నీరు, ఇంటి పన్ను ఎత్తేస్తామని హామీ ఇచ్చినా  గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మలేదన్నారు.

      బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డిలను గెలపించటానికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి పిలుపిచ్చారు. వరంగల్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవటం అనివార్యమన్నారు. నాగార్జున సాగర్‌లో బీజేపీ జెండా ఎగురాల్సిన అవసరం ఉందని చెప్పారు. గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురటమే మనందరి లక్ష్యం కావాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: