సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి.. తెలంగాణలో పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందన్న కిషన్ రెడ్డి... కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.రానున్న రెండేళ్లు తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమన్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదన్నారు కేంద్ర మంత్రి. వరద బాధితులకు సాయాన్ని నిలిపివేయటం దుర్మార్గమన్నారు. ఉచిత నీరు, ఇంటి పన్ను ఎత్తేస్తామని హామీ ఇచ్చినా గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మలేదన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డిలను గెలపించటానికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి పిలుపిచ్చారు. వరంగల్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవటం అనివార్యమన్నారు. నాగార్జున సాగర్లో బీజేపీ జెండా ఎగురాల్సిన అవసరం ఉందని చెప్పారు. గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురటమే మనందరి లక్ష్యం కావాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.