ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారు. కర్నూలు జిల్లా డోన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు నడిరోడ్డుపైనే గొడవ పడ్డాయి.  కత్తులు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తల ఫైటింగ్ తో  స్థానికులు హడలెత్తిపోయారు. ఏం జరుగుతుందోనన్న  భయంతో జనం
వణికిపోయారు. స్థానికుల సమాచారంతో స్పాట్ కు వచ్చిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.


 డోన్ పట్టణంలోని పాతపేటకు చెందిన ఫరీద్, నాగరాజు వర్గాలకు చెందిన యువకులు రోడ్లపైకి వచ్చి కత్తులు, రాళ్లతో ఘర్షణకు దిగారు. అరగంటపాటు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. దీంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒక వర్గం నుంచి నాగరాజు, కిశోర్, కిరణ్‌లు, ప్రత్యర్థి వర్గంలో ఫరీద్, వలీ, మరొకరు గాయపడ్డారు.గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన నాగరాజును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మామూళ్లు, దందాల పంపకాల్లో తేడాల వల్లే వైసీపీ నేతలు కొట్టుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీకే చెందిన నగరాజు, ఫరీద్‌లు వేర్వేరుగా వర్గాలుగా విడిపోయారు. మట్కా, మద్యంపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు వీరి మధ్య గొడవలు జరిగాయి. ఆదివారం  సాయంత్రం ఘర్షణ కూడా ఇందులోనే భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది. పాత కక్షలతో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు యువకులు తొలుత ఘర్షణ పడగా, ఆ తర్వాత ఇరు వర్గాల వారు అక్కడికి చేరుకుని రాళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు.రాళ్లు, కత్తులతో దాడులకు దిగడంతో కొంత సేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సకాలంలో రాకుంటే పరిస్థితులు తీవ్రంగా మారేవని చెబుతున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: