తెలంగాణలో రెవెన్యూ ట్రిబ్యూనల్స్ ప్రారంభమయ్యాయి. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వేలల్లో పేరుకు పోయిన భూవివాదాలు ట్రిబ్యూనల్స్ కు సవాల్ గా మారనున్నాయనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ భూమి హక్కులు-పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-2020లోని సెక్షన్‌ 13 ప్రకారం, ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ జీఓ4ను సిఎస్ సోమేష్‌కుమార్ జారీ చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 16, 17 ప్రకారం స్పెషల్ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను ఆ జిఓలో వెల్లడించారు. గెజిట్ ప్రకటించిన రోజు నుంచి ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఉనికిలోకి వస్తాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూలు ఉంటారు. ఒకవేళ అదనపు కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంటే ఆ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను సభ్యుడిగా చేర్చాలని ఆ నిబంధనల్లో ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాలో ఇద్దరు అదనపు కలెక్టర్‌ల పోస్టులు ఖాళీగా ఉన్న పక్షంలో జిల్లా రెవెన్యూ అధికారిని సభ్యుడిగా గుర్తించాలని సూచించారు.

ప్రత్యేక ట్రిబ్యునళ్ల నిర్వహణకు కలెక్టర్లు ... తమకు అనువుగా సిబ్బందిని జిల్లాలోని ఎక్కడినుంచైనా తీసుకోవచ్చని తెలిపింది. ఈ ట్రిబ్యునళ్ల ప్రోసీడింగ్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్డ్ రికార్డుల ఆధారంగా కేసుల విచారణ నిర్వహించనున్నారు. ప్రతి కేసుకు ఒక నెంబర్ ఇచ్చి వరుసగా ట్రాక్ చేసే వెసులుబాటును కల్పిస్తారు. ఈ ట్రిబ్యునళ్లకు తెలంగాణ ల్యాండ్స్ ఇన్ రైట్ అండ్ పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020లోని సెక్షన్ 13 ప్రకారం అధికారాలు కల్పించనున్నారు. ట్రిబ్యునల్స్‌కు ... బదిలీ చేసిన కేసులన్నింటిని విచారించే అధికారాన్ని కట్టబెట్టారు. అన్ని కేసులను సత్వరమే విచారించి నెలరోజుల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ధేశించింది. పోస్ట్ డిస్పోజల్ యాక్షన్‌లో భాగంగా కేసులను ముగించిన తరువాత రికార్డుల్లో చేర్చడం, ఆఫీసు మాన్యువల్ ప్రకారం కలెక్టర్‌లు బాధ్యత తీసుకొని పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త చట్టంలో కూడా అప్పీల్ వ్యవస్థకు ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రాథమిక వివరాలను బట్టి  రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ కోర్టుల్లో వివాదాలున్న భూములు  లక్షా 11 వేల 285 ఎకరాలుగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ కోర్టుల్లో 41 వేల 961 ఎకరాలకు చెందిన భూముల వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయని, పిఓటి వివాదాల భూములు 95 వేల 214 ఎకరాలుగా, కుటుంబ సర్వే రద్దు, బదల్ వివాదాలు 2 లక్షల 74 వేల 697 ఎకరాలుగా ప్రభుత్వం తేల్చింది. వీటితో పాటు ఇతర వివాదాలు 3 లక్షల 98 వేల 295 ఎకరాలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. అయితే వీటిలో కొన్ని పరిష్కారం కాగా మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: