మరీ ముఖ్యంగా తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ద్రుఢంగా వినిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. తన వాణిని, బాణిని ఆసాంతం తెలుగు జాతి అభ్యున్నతికి, ముఖ్యంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి పాటు పడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యారు. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లారు. ఫలితంగా దేనినైనా బ్రతిమాలి సాధించుకోవడం కాకుండా హక్కుగా సాధించుకునేలా ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం వచ్చేలా చేశారు. అయితే.. అన్నగారు చూపించిన స్ఫూర్తి.. ఇచ్చిన పిలుపు నేటి నేతలకూ దిశానిర్దేశమే.
ముఖ్యంగా.. ప్రస్తుత పరిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రంలోని సర్కారు దగ్గర.. ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే... తెలుగు వారికి ఉత్తర భారతంలో నేటికీ.. గౌరవం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నాడు అన్నగారు ఎలాంటి దూకుడు చూపించారో.. అదే నేటి నేతలకు అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు సాధించే క్రమంలో ఉమ్మడిగా ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్నగారి స్ఫూర్తితో రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయడం అత్యవసరం.
రాజకీయాల్లో ఎన్ని వ్యూహాలు ఉన్నా.. దూకుడుగా ముందుకు సాగినా.. ఆత్మగౌరవం అత్యంత ముఖ్యం. ఇది కోల్పోయిన నాడు.. మాత్రం చరిత్రను సృష్టించలేరనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. ఈ ఆత్మగౌరవ నినాదమే.. నాటి ఎన్టీఆర్ను నేటికీ ప్రజల్లో దేవుడిగా నిలబెట్టిందనే వాస్తవం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. క్షేత్రస్థాయి ప్రజలకు చేరువ కావడం అత్యంత అవసరం అనే విషయాన్ని టీడీపీఅధినేత చంద్రబాబుసైతం గుర్తించాల్సిన అవసరం ఉంది. పైపై ఆర్భాటాలు.. ప్రచార రాజకీయాలను పక్కన పెట్టి.. నాడు ప్రజల కోసం అన్నగారు అవలంబించిన మార్గాన్ని అనుసరించాలనే అంశానికి సంకల్పం చెప్పుకోడానికి ఇదే సరైన తరుణం!!