ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ... విజయనగరం జిల్లా రామతీర్థం రూ.3 కోట్ల వ్యయంతో పునఃనిర్మాణం చేస్తామని అన్నారు. రామతీర్థం పునః నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన అన్నారు. విజయనగరంజిల్లా శ్రీ రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునః నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు సిఎం జగన్ కేటాయించారని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేసారు. రామతీర్థానికి సంబంధించి పండితుల సలహాలు, వైఖాసన ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణంపై చర్చ జరిగిందని అన్నారు.
700 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో జరగనుంది అని ఆయన వెల్లడించారు. కోదండ రాముని విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తయారు చేసి అందజేయనున్నారు అని ఆయన పేర్కొన్నారు. రామతీర్థం మెట్ల మార్గం సరిచేయడంతోపాటు నూతన మెట్లు నిర్మాణం చేస్తామని అన్నారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంకరణ ఉంటుందని అన్నారు. శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపర్చటం, కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హోమశాల, నివేదన శాల నిర్మాణం కూడా పూర్తి చేయడంపై దృష్టి పెట్టామని అన్నారు.