ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్, టీడీపీ-బీజేపీలపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలు తొలగించినప్ఫుడు బీజేపీకి చెందిన వ్యక్తే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారని, అప్పుడు బీజేపీ ఎందుకు నోరు విప్పలేదని, దేవాలయాలు కూల్చే చంద్రబాబు మీకు దేవుడా అని బీజేపీని నిలదీశారు.
అయితే ఇక్కడ అవంతి ఓ లాజిక్ మిస్ అవుతున్నారని టీడీపీ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలు విజయవాడ కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ అభివృద్ధిలో భాగంగా తొలగించారని, అప్పుడు బీజేపీ కూడా విమర్శలు చేసిందని గుర్తు చేస్తున్నారు. అలాగే అప్పుడు అవంతి టీడీపీ ఎంపీగానే ఉన్నారని, అప్పుడే అవంతి బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించి మాట్లాడాల్సిందని చెబుతున్నారు. కానీ అప్పుడు అవంతికి బాబు దేవుడులా కనిపించి ఉంటారని ఎద్దేవా చేస్తున్నారు. పైగా ఫ్లై ఓవర్ పూర్తి అయ్యాక ఆ క్రెడిట్ తమదంటే, తమదే అని వైసీపీ-బీజేపీలు పోటీ పడ్డాయని అంటున్నారు.
కానీ ఆలయాల తొలగింపుపై మాత్రం చంద్రబాబునే తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలని అంటున్నారు. ఇలాంటి విమర్శలు ఆపేస్తే అవంతి రాజకీయాలపై ప్రజలకు కాస్త విశ్వసనీయత ఉంటుందని, లేదంటే ఇలాంటి విమర్శలని ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండరని చెబుతున్నారు. మొత్తానికైతే అవంతి పూర్తిగా లాజిక్ మిస్ అయినట్లే కనిపిస్తున్నారు.