జానారెడ్డికి ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకే నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ టీఆర్ఎస్ పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వస్తోంది. అయితే దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపడంతో ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయింది. దీంతో సాగర్ లో నోముల ఫ్యామిలీని బరిలోకి దింపే విషయంలో కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి లాంటి ఉద్దండ నేత పోటీ చేస్తున్నందున.. అతనికి భగత్ సరితూగలేరనే చర్చ పార్టీ నేతల నుంచే వస్తోందని తెలుస్తోంది. ఆర్థికంగా, రాజకీయంగా, స్థానికంగా బలవంతుడైన జానారెడ్డిని ఎదుర్కోవడం నోముల కుటుంబానికి సాధ్యం కాదనే అభిప్రాయానికి గులాబీ పెద్దలు వచ్చారని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ లో సినీ హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చాలా కాలంగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ పరిసర ప్రాంతానికి చెందిన వారు. ఆర్థికంగా జానారెడ్డి సరితూగే వ్యక్తి. అంతేకాదు మెగాస్టార్ కుటుంబానికి దగ్గరి బంధువు కావడం ఆయనకు అదనపు అర్హత. నాగార్జున సాగర్ లో రెడ్డి సామాజిక వర్గానిదే ఆదిపత్యం. ఈ లెక్కన సాగర్ లో పోటీకి చంద్రశేఖర్ రెడ్డి సరైన వ్యక్తని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కూడా వేలల్లోనే ఉన్నాయి. అల్లు అర్జున్ మామను బరిలోకి దింపితే ఈ ఓట్లు కూడా కలిసి వస్తాయని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారని చెబుతున్నారు.