ఎమ్మెల్యే ముందే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఎంపీ సోయం బాపురావు నిప్పులు చెరిగారు. పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికలలో వాగ్ధానం ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు అని ఆయన మండిపడ్డారు. పట్టాలు ఇవ్వడం చేతగాక మహరాష్ట్ర నుండి పులులు తీసుకొచ్చి ఆదివాసి ప్రాంతాలలో వదిలేస్తున్నారు అని అన్నారు. ఇప్పటికే పులుల దాడిలో ఇద్దరు ఆదివాసులు ప్రాణాలు కోల్పోయారు అని ఆయన ఆరోపించారు. అయినా ప్రభుత్వం పులులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు అని మండిపడ్డారు.
ఇంకెన్ని ఆదివాసి ప్రాణాలు పోయే వరకు ప్రభుత్వం ఎదురు చూస్తుంది అని ఆయన నిలదీశారు. ఫిబ్రవరి 15 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడువిస్తున్నాం అప్పటి వరకు పోడు భూములకు పట్టాలివ్వాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఇవ్వకపోతే తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తో యుద్ధానికి సిధ్దమవుతాం అని హెచ్చరించారు. బీజేపి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసులకు చెబుతున్నా అని... రాష్టం లో ముమ్మాటికి బీజేపి ప్రభుత్వమే.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇబ్బంది పెట్టిన పోలీసులను వదలబోము అని ఆయన హెచ్చరించారు. మొన్నటి వరకు జై తెలంగాణ నినాదం నడిచింది... ఇక నుండి జై శ్రీరాం నినాదాలు నడుస్తాయి అని పేర్కొన్నారు.