స్నేహంగా ఉన్నామని చెబుతూనే భారత్ పై కుట్రలు కొనసాగిస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. భారత
అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  చైనా ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిందని తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో ఆ గ్రామం ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా నిర్మించినట్లు చెబుతున్న ఆ గ్రామంలో 101 గృహాలు ఉన్నట్టు గుర్తించారు. భారత్- చైనా సరిహద్దులకు 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామాన్ని చైనా నిర్మించిందని నిపుణులు విశ్లేషించారు. గతేడాది నవంబరు 20 నాటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన నిపుణులు.. అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్సిరి జిల్లాలోని త్సారీ చు నదీ తీరం వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంపై భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్నాయి.

         భారత భూభాగంలో  చైనా గ్రామం నిర్మించడం పట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ  అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోడీ ఓ బలహీన, అసమర్థ ప్రధాని అంటూ మండిపడ్డారు. "చైనా మన భూభాగంలో గ్రామాలు నిర్మిస్తోంది. ఇదేమైనా షీ జిన్ పింగ్ కు ప్రత్యేక ఆవాస్ యోజనా ఏంటి?" అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రధానులుగా పనిచేసిన వారందరిలోకి నరేంద్ర మోడీ అత్యంత దుర్భలుడైన ప్రధాని అని విమర్శించారు. సిక్కిమ్ లోని నాకు లా, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొచ్చుకువస్తుంటే మౌనంగా ఉంటున్నారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.

      "మన భూభాగం చైనా అధీనంలో ఉందని చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మా భాభూగం మాకిచ్చేయండంటూ చైనాను ఎలాంటి డిమాండ్లు చేయడంలేదు. చైనా నుంచి మన భూభాగాలను విడిపించేందుకు ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవడంలేదు. చైనా చేతిలో మన వీరసైనికులు మరణించినందుకు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవడంలేదు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు అసద్.



మరింత సమాచారం తెలుసుకోండి: