అయితే.. ఈ వార్తలు తప్పని భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా తెగేసి చెప్పడం లేదు. ఈ తీరు చూస్తుంటే ఈ కట్టడాలు నిజంగానే ఉన్నట్లు అనిపిస్తోందని అందరూ భావిస్తున్నారు. ‘సరిహద్దు వద్ద వివాదాస్పద ప్రాంతాల్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోందన్న వార్తలు మా దృష్టికి కూడా వచ్చాయి. అయితే చైనా గతంలోనూ అనేక పర్యాయాలు ఇలాంటి పనులు చేసింది’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో భారత్ కూడా సరిహద్దు వెంబడి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తోంది. సరిహద్దు ప్రాంతాలకు వెంటనే చేరుకునేలా రోడ్డు నిర్మాణాలు చేపడుతోంది.
ప్రస్తుతం చైనా కట్టడాలు కనిపిస్తున్న ఈ ప్రాంతం గురించి భారత్కు గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. చైనా దురాక్రమణ చర్యల గురించి అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ టాపిర్ గావ్ గతేడాది నవంబర్లోనే హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా ఎగువ సుబన్ సిరి జిల్లాలో చైనా కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తాజాగా మరోసారి ఈ విషయమై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. సరిహద్దుకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చైనా చొచ్చుకు వచ్చింది. నది వెంబడి వెళితే.. ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. స్థానికంగా లెన్సీ అని పిలిచే ఓ నది వెంబడి చైనా ఓ రోడ్డు కూడా నిర్మిస్తోంది’ అని ఈ ఎంపీ జాతీయ మీడియాతో చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.