న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా మరోసారి బరి తెగించింది. విస్తరణ వాదంతో చెలరేగుతున్న డ్రాగన్ కంట్నీ.. భారత భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అరుణాచల్ ‌ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత్ భూభాగంలో ఈ గ్రామాన్ని నిర్మించిందని వార్తలు వస్తున్నాయి. ఎగువ సుబన్ సిరి జిల్లాలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా.. ఏకంగా 101 ఇళ్లు కట్టేసినట్లు సమాచారం. భారత్ భూభాగమైన ఈ ప్రాంతాన్ని చైనా అనేక మార్లు తమదేనంటూ ప్రకటించింది. గతంలో ఇక్కడ పలు మార్లు హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. చైనా ఈ గ్రామం నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా బయట పడిందని నిపుణులు చెప్తున్నారు. ఆగస్టు 2019 నాటి చిత్రాలతో పోలిస్తే.. గతేడాది నవంబర్‌లో ఈ ప్రాంతంలో ఏకంగా 101 కట్టడాలు కనిపించాయి. దీన్ని బట్టి ఈ ఇళ్లన్నీ గతేడాదే కట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే.. ఈ వార్తలు తప్పని భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా తెగేసి చెప్పడం లేదు. ఈ తీరు చూస్తుంటే ఈ కట్టడాలు నిజంగానే ఉన్నట్లు అనిపిస్తోందని అందరూ భావిస్తున్నారు. ‘సరిహద్దు వద్ద వివాదాస్పద ప్రాంతాల్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోందన్న వార్తలు మా దృష్టికి కూడా వచ్చాయి. అయితే చైనా గతంలోనూ అనేక పర్యాయాలు ఇలాంటి పనులు చేసింది’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో భారత్ కూడా సరిహద్దు వెంబడి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తోంది. సరిహద్దు ప్రాంతాలకు వెంటనే చేరుకునేలా రోడ్డు నిర్మాణాలు చేపడుతోంది.

ప్రస్తుతం చైనా కట్టడాలు కనిపిస్తున్న ఈ ప్రాంతం గురించి భారత్‌కు గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. చైనా దురాక్రమణ చర్యల గురించి అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ టాపిర్ గావ్ గతేడాది నవంబర్‌లోనే  హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా ఎగువ సుబన్ సిరి జిల్లాలో చైనా కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తాజాగా మరోసారి ఈ విషయమై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. సరిహద్దుకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చైనా చొచ్చుకు వచ్చింది. నది వెంబడి వెళితే.. ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. స్థానికంగా లెన్సీ అని పిలిచే ఓ నది వెంబడి చైనా ఓ రోడ్డు కూడా నిర్మిస్తోంది’ అని ఈ ఎంపీ జాతీయ మీడియాతో చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: