తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక అలాగే నిన్నటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో బీజేపీ పార్టీ క్రమక్రమంగా బలం పెంచుకుంటుంది. అన్ని ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వలసలు ఎక్కువవుతున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు చాల ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలో కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ కూడా చేరారు. తను కూడా కాషాయ పార్టీలోకి చేరిపోయారు. సోమవారం వికారాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన బీజేపీలో చేరేలా డీకే అరుణ మంత్రాంగం నడిపారు.


 చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. నాలుగుసార్లు టీడీపీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు దక్కడం లేదని.. వెన్నుపోటుదారులకు పెద్ద పీట వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీలో చేరిన ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు మోదీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని.. కేసీఆర్ సర్కారు ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌ను సవాల్ చేసే సత్తా తెలంగాణలో బీజేపీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్థానం ముగిసిందన్నారు. సర్పంచ్‌ని కలెక్టర్‌ సస్పెండ్‌ చేసేందుకు వీలు కల్పిస్తూ.. జీవో తెచ్చిన కేసీఆర్‌.. సీఎంను కూడా చీఫ్ సెక్రటరీ సస్పెండ్‌ చేసే జీవో తేవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తలనరుక్కుంటా అని గతంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌పై.. ఆత్మహత్య నేరం.. 309 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. వికారాబాద్‌ని చార్మినార్ జోన్‌లో కలపాలని చంద్రశేఖర్ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: