వరంగల్ స్థానం నుంచి ప్రస్తుతం పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మళ్లీ ఆయన్నే పోటీ చేయాలని హైకమాండ్ కోరుతున్నా మొదట ఆయన ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఓటమి భయంతో ఆయన పోటీకి ఇష్టపడలేదట. అయితే సీఎం కేసీఆర్ సూచనలతో వరంగల్- నల్గొండ- ఖమ్మం సీటు నుంచి తిరిగి బరిలోకి దిగేందుకు పల్లా అంగీకరించారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్-రంగారెడ్డిద మహబూబ్ నగర్ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థి దొరకడం లేదు. జీహెచ్ఎంసీ మేయర్బొంతు రామ్మోహన్ను పోటీలో దింపేందుకే అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి ఓటమిపాలైన దేవీప్రసాద్ పోటీ చేయనంటూ చెప్పుకొచ్చారు. మరో ఎమ్మెల్సీ శంభీపూర్రాజు కూడా పోటీకి దూరంగానే ఉంటున్నారు. దీంతో బొంతు రామ్మోహన్ ఎంపిక అనివార్యం కానుంది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవకపోవడంతో.. అధికార పార్టీ నేతలకు గెలుపుపై ఆశలు లేవంటున్నారు.
రాష్ట్రంలో 2015లో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో టీఆర్ఎస్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నుంచి అధికార పార్టీ క్యాండిడేట్, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓడిపోయారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి కష్టపడాల్సి వచ్చింది. ఎన్నికలంటేనే తమకు ఎదురే లేదనుకునే క్రమంలో ఇలాంటి ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ పెద్దలు కంగుతిన్నారు. అనంతరం కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్రెడ్డి విజయం సాధించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పూల రవీందర్ ఓటమి చెందగా నర్సిరెడ్డి గెలిచారు.