అడవుల జిల్లా  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు కొత్త భయం నెలకొంది. పెద్ద పులుల సంచారంతో జిల్లాలోని అటవీ పరిసర గ్రామాలు వణికిపోతున్నాయి. జనావాసాల్లోకి పెద్దపులులు, చిరుతపులులు సంచరిస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. జిల్లాలో పులులు ఇప్పటికే ఇద్దరిని చంపగా.. ప్రతి రోజూ ఏదో ఓ ప్రాంతంలో మనుషులు, పశువులపై దాడికి పాల్పడుతున్నాయి. 5 నెలల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం దిగడలో ఓ గిరిజన యువకుడు, పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో మరో గిరిజన బాలికపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఇతర ప్రాంతాలు, గ్రామాల్లోనూ పెద్దపులులు, చిరుత పులుల సంచరిస్తూ మనుషులు, పశువులపై దాడులు చేస్తున్నాయి.
దీంతో అటవీ పరిసర గ్రామాలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడెం కు చెందిన వారితో పాటు ఉమ్మడి జిల్లాలోని చాలా చోట్ల జనం చేలకు, పొలలకు, అడవికి వెళ్లాలంటే జంకుతున్నారు.

     ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో 7 పెద్దపులులున్నాయి. వాటిలో ఒక ఆడ, రెండు మగ పులులతో పాటు పులి పిల్లలు ఉన్నాయి.ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు ప్రాంతం నుంచి ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, దహేగాం మీదుగా మంచిర్యాల కోటపల్లి, నీల్వాయి, చెన్నూరు వరకు పెద్ద పులుల సంచరిస్తున్నాయి. తాజాగా ముధోల్ నియోజకవర్గంలోని అటవీ పరిసర గ్రామాల్లో పెద్దపులులు, చిరుతలు సంచరిస్తుండటంతో కలవరం మొదలైంది. ఇక్కడు రెండు పెద్దపులులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

 పులుల సంచారం, కదలికలపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. పెద్దపులి ఫొటో దొరికితే.. రంగును బట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని తల్లి ఎవరు? వంటి సమగ్ర సమాచారం తెలుసుకునే వీలుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతున్నా.. పులుల జాడ తెలియటం లేదు. పాదముద్రలను సేకరిస్తూ.. బంధించేందుకు రెస్య్కూ, ఫ్లైయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. బెజ్జూరు, దహేగాం, పెంచికల్పేట్ మండలాల్లోని 52గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పులికి ఎరగా ఆవులను ఉంచుతున్నారు. 340 సీసీ కెమెరాలు, 60 మంది టైగర్ ట్రాకర్లతో పులి కదలికలపై నిఘా పెట్టారు. ఇటీవల గుండ్లపల్లిలోని ఏ2 టైగర్ కెమెరాలకు చిక్కింది.

        మహారాష్ట్రకు చెందిన నిపుణులతో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతోంది. కోర్ ఏరియాలోని గ్రామాలను తరలించేందుకు చర్యలు చేపట్టగా.. ముందుగా కడెం మండలం రాంపూర్, మైసంపేట, రెండో విడతలో అల్లీనగర్, గండిగోపాల్పూర్, ఇస్లాంపూర్, దొంగపల్లి, మిద్దెచింత గ్రామాలను ఖాళీ చేయించాలి. ఆదివాసీలను అడవుల నుంచి బయటకు పంపేందుకే సర్కారు కుట్ర చేస్తోందని.. అందుకే పెద్దపులిని పట్టుకోవటం లేదని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: