వడమాలపేట మండలం పాదిరేడు రెవిన్యూ గ్రామంలో 475 ఎకరాల భూమిని పారిశ్రామికవాడ కోసం రోజా పట్టుబట్టి సేకరిస్తున్నారు. భూములిచ్చిన రైతులకు ఆమె పలు హామీలు కూడా ఇచ్చారు. మొత్తం ప్రక్రియ పూర్తవుతున్న దశలో ఒక్కసారిగా ఆ భూములను టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలన్న ప్రతిపాదన సిద్ధం చేయడంపై రోజాకు కోప తెప్పిస్తోందంట. రైతులకు అనేక హామీలిచ్చి సేకరించిన భూమి ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తే తనపై రైతులకు, ప్రజలకు దురాభిప్రాయం ఏర్పడుతుందని ఆమె ఆందోళన చెందుతున్నారంట. ఇదిలా ఉండగా టీటీడీకి చెందిన ఓ కీలక వ్యక్తి, జిల్లాకు చెందిన ఓ మంత్రి ఎమ్మెల్యే రోజాకు తెలియకుండానే ఆ భూములను టీటీడీ ఉద్యోగులకు కేటాయించేలా అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించడంతో పాటు నేరుగా సీఎం జగన్ను కలసి ఆమోదముద్ర వేయించారని వైసీపీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఆలస్యంగా విషయం తెలుసుకున్న రోజా నేరుగా సీఎంను కలసి పరిస్థితిని వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై సీఎం ఏమన్నారో అన్న విషయం ఇంకా బయటకు రావడం లేదు. తొలుత సంబంధిత భూములను ఏపీఐఐసీ కోసం సేకరిస్తున్నందున టీటీడీకి కేటాయించలేమని టీటీడీకి లేఖ రాసిన జిల్లా ముఖ్య అధికారి, తర్వాత దానికి విరుద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం రోజాకు ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికే పనిగట్టుకుని ఇలా చేస్తున్నారని రోజా భావిస్తున్నట్టుగానే ఆమె భావిస్తున్నారంట. చూడాలి మరి ఈ భూముల వ్యవహారంలో రోజా మాట నెగ్గించుకుంటారా..? లేదా అన్నది వేచి చూడాలి.