ఒకప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని ఏదైనా చిటికెలో తెలిసిపోతోంది. ఇప్పుడు మన పక్కలో బల్లెమైన చైనా ఆగడాలను కూడా ఉపగ్రహ టెక్నాలజీ బయటపెడుతోంది. సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్నది శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసిపోతోంది. తాజా చైనా భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువచ్చి చేసిన దురాక్రమణను శాటిలైట్ చిత్రాలు బయటపెట్టాయి.

చైనా మన భూబాగంలోకి వచ్చి ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించిన ఉదంతం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఈ గ్రామంలో 100కు పైగా ఇళ్లు కట్టింది. ప్లానెట్‌ ల్యాబ్స్‌ గతేడాది నవంబర్‌ 1న తీసిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చైనా దురాక్రమణపై ఎన్డీటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సుభాన్‌సిరి జిల్లాలో సారిచూ నది ఒడ్డున ఈ గ్రామం ఉన్నది. ఈ ప్రాంతంపై చైనా, భారత్‌ల మధ్య  1959 నుంచి వివాదం ఉన్నది. 2019 ఆగస్టు 26వ తేదీన తీసిన ఫొటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. నవంబర్‌ 1న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఏకంగా ఓ ఊరు కనిపించింది.. అంటే ఒక్క ఏడాదిలోనే చైనా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఏకంగా ఓ గ్రామం నిర్మించిందన్నమాట.

ఇప్పుడు ఈ దురాక్రమణపై మీడియాలో కథనాలు రావడంతో భారత్ ఆచితూచి స్పందించింది. ఉపగ్రహ చిత్రాలు వార్తాచానళ్లలో ప్రసారం కావడంతో వివరణ ఇచ్చింది. సరిహద్దుల్లో ప్రజల జీవన సౌకర్యాలు మెరుగుపర్చేందుకు భారత ప్రభుత్వం రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నదని పేర్కొన్నది. దేశ సరిహద్దుల వద్ద అన్ని వేళలా నిఘా ఉంటుందని, దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసింది. అయితే సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మ్యాప్‌ ప్రకారం చూసినా చైనా నిర్మించిన ఈ గ్రామం భారత భూభాగంలోనే ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: