రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల మొదటి వారంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేశారు. దానిని బట్టీ చూస్తే ఈ నెల 23న పంచాయాతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అంటే ఇప్పటికి కచ్చితంగా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది.
దాంతో అందరిలో టెన్షన్ నెలకొని ఉంది. ఇక ఎట్టి పరిస్థితిల్లోనూ స్థానిక ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తన వాదనలు ధర్మాసనం ముందు వినిపించింది. మరో వైపు చూస్తే ఎన్నికల సంఘం తరఫున కూడా గట్టిగానే వాదనలు జరిగాయి. ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేశాక ఎన్నికలను ఆపే హక్కు ఎవరికీ లేదని కూడా ఎన్నికల సంఘం తరఫున వాదనలు వచ్చాయి.
ఇక ఏపీలో కరోనా వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రొగ్రాం సాగుతోందని, దాంతో ఒకే సమయంలో స్థానిక ఎన్నికలను నిర్వహించలేమని కూడా ప్రభుత్వం చెబుతోంది. మరి దీని మీద ధర్మాసనం ఏ రకమైన తీర్పు ఇస్తుంది అన్నది ఆసక్తిగా మారుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మూడు రోజుల్లో వెలువడుతుంది కాబట్టి ఈ లోగానే తీర్పు రావచ్చు అని భావిస్తున్నారు. మరి ఆ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల విషయంలో రెండు రాజ్యాంగ బద్ధమైన సంస్థల మధ్యన పోరు మాత్రం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.