సరిహద్దులో చైనా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. డ్రాగన్‌ కంట్రీ దుస్సాహాసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చైనా మరోసారి తన కుటిల బుద్ధి చూపించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ వెంబడి భారత భూభాగంలోకి నాలుగున్నర  కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. అక్కడ ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. దాదాపు 101 ఇళ్లు ఉన్న గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్‌ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతున్నాయి.

గతేడాది నవంబర్‌లోనే చైనా డోక్లాం ఘర్షణ స్థావరానికి అతి సమీపంలో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాస్తవ సరిహద్దుకు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే మరో గ్రామాన్ని నిర్మించింది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా చైనా నిర్మించిన గ్రామం భారత్‌-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సుబన్సిరి జిల్లా సారిచు నది ఒడ్డున ఉంది. ఇక్కడ నిత్యం ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి

ప్రస్తుతం చైనా గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతానికి సంబంధించి... 2019 ఆగస్టు నాటి శాటిలైట్‌ ఫోటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. 2020 నవంబర్‌ చిత్రాల్లో​మాత్రం వరుసగా ఇళ్లు దర్శనమిచ్చాయి. అంటే ఏడాది వ్యవధిలోనే చైనా ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఫోటోలని బట్టి అర్థమవుతోంది.

ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించగా.. సరిగా స్పందించలేదని తెలిసింది. అయితే భారత్ మాత్రం గట్టి  హెచ్చరికనే ఇచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపట్టిన నిర్మాణ పనులను ఇండియా జాగ్రత్తగా గమనిస్తోందని చైనాకు వార్నింగ్ ఇచ్చింది. గతకొన్నేళ్లుగా చైనా సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడుతోంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా చేపట్టిన నిర్మాణాల గురించి గతేడాది నవంబర్‌లోనే ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ప్రస్తావించారు. చైనా చొరబాట్ల గురించి, ప్రత్యేకంగా ఎగువ సుబున్సిరి జిల్లా గురించి హెచ్చరించారు. అయినా కేంద్రం అంతగా నిఘా ఉంచకపోవడంతో.. చైనా ఈ దుస్సాహాసానికి దిగింది. చైనా ఆక్రమణలను తిప్పికొట్టకుండా...మోడీ చోద్యం చూస్తున్నారని  ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ విరుచుకుపడ్డారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: