మనకు పక్కలో బల్లెంలా అనిపిస్తున్నా.. చైనాను కొన్ని విషయాల్లో అభినందించకుండా ఉండలేం. ఇలాంటిదే ఈ ఆవిష్కరణ కూడా. వేగవంతమైన రైళ్లను ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చైనా ఇప్పుడు అత్యంత వేగంతో ప్రయాణించే మాగ్లెవ్ ట్రైన్ ప్రోటోటైప్ను రూపొందించింది. మన ఇండియాలో 180 కిమీ వేగంతో వెళ్తే గొప్ప.. 300 కి మీ వేగం అందుకునేందుకు మన వాళ్లు ప్రయోగాలు చేస్తున్నారు. అయితే.. ఈ మాగ్లెవ్ రైలు ఏకంగా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుందట.
చైనాలోని చెంగ్డూలో ప్రదర్శించిన ఈ ప్రోటోటైప్ హైటెంపరేచర్ సూపర్ కండక్టింగ్-హెచ్టీఎస్ మాగ్లెవ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ మాగ్లెవ్ రైలు విద్యుత్ శక్తిని వినియోగించుకోకుండాశక్తివంతమైన అయస్కాంతాల సాయంతో పట్టాలపై అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. చైనాకు చెందిన జియో టాంగ్ విశ్వవిద్యాలయం, చైనా రైల్వే గ్రూప్ లిమిటెడ్, సీఆర్ఆర్సీ కార్పొరేషన్.. ఇవన్నీ కలిసి ఈ మాగ్లెవ్ రైలును డెవలప్ చేశాయి. ఇంకా ఈ రైలును మరింతగా ఆధునికీకరించనున్నారట.
మన పొరుగున ఉన్న రెండు దేశాల్లో పాకిస్తాన్ మనకంటే అనేక విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. పాక్ కంటే భారత్ ఎన్నో రెట్లు బలమైంది. అందువల్ల పాక్ విషయంలో పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. కానీ చైనా సంగతి అలా కాదు. చైనా మనకంటే అన్ని విషయాల్లోనూ బలమైందే. చివరకు జనాభాలో కూడా. టెక్నాలజీ, ఆర్థికం, సైనికం.. ఇలా ఏ కోణంలో చూసినా ఇండియా చైనా ముందు బలహీనమైందే. మనవాళ్లు చైనా స్థాయిని ఎప్పుడు అందుకుంటారో..