అమెరికా అధ్యక్షుడిగా జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (జో బైడెన్) ఎన్నికైన తరువాత చైనాపట్ల సానుకూలంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంత దూకుడుగా జో బైడెన్ ఏనాడూ వ్యవహరించరు. అది ఆయన స్వభావం కాదనేది అంతర్జాతీయంగా ప్రచారంలో ఉన్న మాట.

అమెరికా ఎన్నికల ప్రచార సమయంలోనూ చైనా పట్ల  దాని నాయకత్వం పట్ల చాలా ఆచితూచి తనదైన లౌక్యంతో సంయమనాన్నే ప్రదర్శించారు. ట్రంప్ మాదిరిగా గిల్లికజ్జాలు పెట్టుకోకుండా, “విధానానికి ప్రాముఖ్యతనిస్తూ, వివాదాలకు దూరంగా” ఉండే ప్రయత్నం చేస్తారని తెలుస్తుంది.

అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టిబెట్ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20న బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ ఈ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదు. తాజా నిర్ణయం భారత్ కు కూడా సానుకూలమైనదే. అదే సమయంలో ఇది చైనాకు మింగుడుపడని చేదు మందు లాంటి నిర్ణయమే. దీనిపై ఇప్పటికే కళ్ళెర్ర చేస్తూ చైనా కారాలు మిరియాలు నూరుతోంది.

టిబెట్ లో చైనాను నిలువరించే నిర్ణయాన్ని అమెరికా డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో నిర్ద్వంధంగా తీసుకుంది. టిబెట్ బౌద్ధమతాధినేత దలైలమా వారసుడి ఎంపికలో చైనా జోక్యాన్ని పూర్తిగా నివారించే ఉద్దేశంతో ఒక బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం టిబెట్ రాజధాని లాసా నగరంలో అమెరికా దౌత్య కార్యాలయాన్ని చైనా అనుమతించనంత వరకు, అమెరికాలో చైనా కొత్తగా దౌత్య కార్యాలయాలు ప్రారంభించేందుకు అంగీకరించదు. అంతేకాక టిబెట్ లో, భారత్ లో నివసించే టిబెట్ ప్రజలకు ఆర్థిక సహాయం అందించడానికి అమెరికా రూపొందించిన తాజా బిల్లు అవకాశం కల్పిస్తుంది.

కొత్త దలైలామా వారసుని ఎంపికకు అడ్డుపడే చైనా, కమ్యూనిస్టు పార్టీ అధికారులు, ప్రభుత్వ అధికారులు అమెరికాలో పర్యటించే అవకాశాలు లేకుండా పటిష్టమైన ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

టిబెట్ నిజానికి ఏమాత్రమూ  చైనాలో భాగం కాదు. స్వతంత్ర దేశం. టిబెట్ భారత్ – చైనా మధ్యలో ఉన్న దేశం. 1949 లో ఏర్పడిన చైనా, 1950లో టిబెట్ ను ఆక్రమించుకుంది. 1959 లో టిబెటన్లు చైనాపై తిరగబడ్డారు. ఛైనా ఆ తిరుగుబాటును నిర్ధాక్షిణ్యంగా అణచి వేసింది.
దరిమిలా టిబెటన్ల ఆధ్యాత్మిక, (బౌద్ధ) మత గురువు దలైలామా శరణార్థిగా భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దలైలమాకు ఆశ్రయం ఇవ్వడం, ప్రవాస ప్రభుత్వాన్నినడుపుకునే అవకాశం భారత్ కల్పించడంపై సహజంగానే చైనా తీవ్ర అసహనంగా ఉంది.

టిబెట్ చైనాలో అంతర్భాగమని నాడు భారత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ దలైలామాకు ఆశ్రయమిచ్చిన విషయం ఈ రెండు పెద్ద దేశాల మధ్య సంబంధాలకు ప్రతిబంధకంగా మారిందన్నది యధార్ధం.  అదో చేదునిజం.దక్షిణాఫ్రికా అంతటి వైశాల్యం గల టిబెట్ జనాభా దాదాపు 30 లక్షలే.. చైనా లోని వివిధ ప్రావిన్సులు టిబెట్ భూభాగాన్ని అన్నిదిశల్లోంచి కమ్మేసి ఆక్రమించగా మరో 30 లక్షల మంది అదనంగా నివసిస్తున్నారు.

సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు భూభాగం టిబెట్ ది జనం చైనాది. నిజం చెప్పాలంటే ప్రస్తుత చైనా భూభాగంలో 25 శాతం టిబెట్ స్వంతమే. అయితే జనాభాలో మాత్రం టిబెటన్ల వాటా కేవలం 0.5 శాతమే కావడం మనం గమనించాల్సిన విషయం. ఇప్పటి వరకు చైనా పట్ల, ముఖ్యంగా టిబెట్ విషయంలో అగ్రరాజ్యం చూసీ చూడనట్లు, వ్యవహరిస్తూ వచ్చింది. కారణం చైనా తనను మించి అభివృద్ధి సాధిస్తుందని తనను ఎదిరిస్తుందని అమెరికా ఏనాడూ భావించలేదు. అన్నిరంగాల్లో ఆధునిక చైనా కొద్దికాలంలోనే అగ్రరాజ్యం అమెరికాను సవాల్ చేసే సామర్ధ్యాన్ని  సంతరించుకుంది.

ఇప్పుడు అంతర్జాతీయంగా చైనా ఎదుగుదల తనకు అత్యంత ప్రమాధకరంగా పరిణమించిందని గ్రహించిన డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం గత నాలుగేళ్లుగా చైనా పట్ల కరకు, కఠిన విధాన వైఖరిని అవలంబించింది. అందుకే చైనాకు చెక్ పెట్టే దిశగా తాజాగా టిబెట్ విషయంలో మొండిగా ముందుకెళ్ళాలని అగ్రరాజ్య నిర్ణయం. కొత్తగా అధికారపగ్గాలు అందుకోనున్న జో బైడెన్ కూడా ముందుకు సాగక తప్పని పరిస్థితులను చట్టం ద్వారా కల్పించారు ట్రంప్

వాషింగ్టన్ తాజా నిర్ణయం భారత్ కు నైతిక మద్దతు కలిగిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నిర్ణయం చైనాపై పరోక్షంగా ఒత్తిడిని పెంచుతుంది. దాని విదేశాంగ ఆర్ధిక నిర్ణయాలపై ప్రభావాన్ని చూపుతుంది. చైనా దూకుడుకు పెద్ద సవాలే. అయితే మున్ముందు కాలప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: