భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు ఎంతకీ చల్లారటం లేదు. సరిహద్దుల్లో డ్రాగన్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా నిర్మించిన గ్రామం మరో వివాదానికి కారణమైంది. ఈ అంశంపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి‌.

చైనా పొరుగు దేశ భూ భాగాల ఆక్రమణ పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్ని నిర్మించటం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆ గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టంచేస్తున్నాయి. ఇది భారత్‌కు ఆందోళనకర అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ సుభాన్‌సిరి జిల్లాలో సారి చు నది ఒడ్డున ఈ  గ్రామం వెలిసింది. ఈ ప్రాంతంపై భారత్, చైనాల మధ్య వివాదం ఉంది. గతంలో ఇక్కడ యుద్ధం కూడా జరిగింది. 2019 నవంబరు 1న తీసిన ఉపగ్రహ చిత్రంలో ఈ గ్రామం కనిపించింది. గత ఏడాది ఆగస్టులో ఈ గ్రామం లేదు. ఆ ప్రాంతంలో చైనా సైనిక శిబిరానికి కొద్దిదూరంలోనే ఈ గ్రామం ఉండటం కలకలం రేపుతోంది. ఆ శిబిరాన్ని కూడా గత దశాబ్ద కాలంలో గణనీయంగా ఆధునికీకరించారు.

సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొన్ని నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత ప్రభుత్వం తెలిపింది. తాము కూడా సరిహద్దుల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేసింది. రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నట్లు వివరించింది. వీటివల్ల స్థానికులకూ ప్రయోజనం చేకూరుతుందని తేల్చిచెప్పింది. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపడుతున్నట్లు ఇండియా పేర్కొంది.

 సరిహద్దు ప్రాంతంలో భారత్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు సైనిక మోహరింపులనూ పెంచుతోందని గత ఏడాది అక్టోబరులో చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. కొన్ని నెలలుగా సాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు ఇదే ప్రధాన కారణమంది. ఐతే తాజా గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడా భారత రోడ్లు, ఇతర మౌలిక వసతులు లేవు.

మరోవైపు...అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఎంపీలు గత ఏడాది నవంబరులో ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. చైనా తమ రాష్ట్రంలోకి చొరబాట్లు సాగిస్తోందని ఆరోపించారు. తాజాగా డబుల్‌లేన్‌ రోడ్డు నిర్మిస్తోందని మండిపడ్డారు. నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయంటున్నారు. నది వెంబడి పరిశీలనలు సాగిస్తే 60-70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. లెన్సి నది పక్కన చైనా రోడ్డును నిర్మిస్తోందని చెబుతున్నారు అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు.

ఈ అంశానికి సంబంధించి కేంద్రంపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. సరిహద్దుల్లో చైనా ఒక గ్రామాన్నే నిర్మించుకుంటే.. మోడీ సర్కార్‌ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భూభాగం రక్షణ విషయంలో... దేశాన్ని ఎవరి ముందుతలవంచనీయమంటూ...గతంలో మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు రాహుల్‌.

రాహుల్‌ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చింది బీజేపీ. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈ ప్రాంతంతో పాటు.. చాలా ప్రదేశాల్ని చైనాకు దారాదత్తం చేసింది నెహ్రూయేనన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రతీసారి చైనాకు కాంగ్రెస్‌ ఎందుకు దాసోహంమంటోందో చెప్పాలన్నారు. బార్డర్‌లో టెన్షన్‌ కాస్తా.. దేశంలో పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: