కేసీఆర్ సర్కారు మాట తప్పింది. పేదలకు ఉచితంగా తాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. ఈ నిబంధనను సవరించే వీలున్నా కూడా పేదలపై భారం మోపేందుకే సిద్ధపడింది. దీంతో గ్రేటర్ పరిధిలోని పేదలంతా వాటర్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. డిసెంబరు 15వ తేదీ నుంచే ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చినా.. మీటర్లు బిగించుకున్న తర్వాతే దాని ప్రతిఫలం ప్రజలకు అందుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. దీంతో.. ప్రతి ఒక్కరూ మీటరు బిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సరఫరా చేసే ప్రతి నీటి బొట్టుకు కచ్చితమైన లెక్క ఉండేలా చర్యలు తీసుకోమని పథకం అమలుకు ముందే జలమండలిని ఆదేశించింది కేసీఆర్ సర్కారు. అయితే అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా నల్లా కనెక్షన్లు తీసుకున్నవారి నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈలోపే ఉచిత నీటి పథకం అమల్లోకి వచ్చేసింది.. అధికారులు నీటి బిల్లులు ఇవ్వడం లేదు కదా... నాలుగైదు నెలల తరువాత మీటర్లు పెట్టుకుందాములే అన్న ధోరణిలో చాలామంది ఉన్నారు. అయితే వీరందరికీ షాకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏరోజయితే మీటరు అమరుస్తారో ఆ రోజు నుంచి ఉచిత నీటి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు. అంతకు ముందు వరకు వాడుకున్న దానికి ఒకే దఫా బిల్లు చేతిలో పెడతామంటున్నారు.

మీటర్లు లేకపోయినా బిల్లు కట్టాల్సిందే..
ఉచిత తాగునీటి పథకం కోసం కొత్తగా మీటర్లు బిగించుకోవడం ఎందుకు, ఇకపై కూడా మీటర్లు లేకుండా ఉచితంగానే వాడుకుంటామంటే కుదరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నల్లా కనెక్షన్లు ఉన్నవారికి డిసెంబరు 15 నుంచి మార్చి నెలాఖరు వరకు అధికారులు నీటి వాడకం బిల్లులు ఇవ్వరు. ఏప్రిల్‌ లో జలమండలి సిబ్బంది ప్రతి నల్లాదారుడి ఇంటికి తనిఖీలకు వెళ్తారు. మార్చి నెలాఖరు నాటికి ఎవరైతే మీటరు అమర్చుకోలేదో వారందరికీ డిసెంబరు 15 నుంచి మార్చి నెలాఖరు వరకు తాగునీటి బిల్లును ఒకేసారి అందజేస్తారు. ఇవి కట్టిన తర్వాతే మీటరు బిగిస్తారు. లేకపోతే మీటరు బిగించరు, మరోసారి సగటు చార్జీ వసూలు చేస్తారు. జనవరి నెలాఖరులోగా మీటర్లు బిగించుకుంటే మాత్రం డిసెంబరు 15 నుంచి అప్పటి వరకు మాత్రమే బిల్లులను ఇస్తారు. ఆ తరవాత కాలానికి నీటి ఛార్జీలను వసూలు చేయరు. అంటే.. ఉచిత నీటి పథకం పేరుతో హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ మీటరు బిగించుకునేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది, అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: