పాత్రికేయులకు - వైసీపీ మంత్రులకు మధ్య ఇటీవల కాలంలో ఆసక్తిక సంభాషణ సాగుతోంది. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా.. పాత్రికేయులు కొంత ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక, వీటికి ఎందుకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నారో.. లేదా.. సమాధానం చెబితే.. ఇరుకున పడతామని భావిస్తున్నారో .. తెలియదు కానీ.. మంత్రులు మాత్రం సదరు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే దాటవేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. రాష్ట్రంలో నూతన సచివాలయానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడే అన్ని కార్యాయాలూ ఉన్నాయి. అయితే.. ఇక్కడకు మంత్రులు ఎవరూ రావడం లేదు.
మరీ ముఖ్యంగా శాఖాధిపతులు కూడా రావడం లేదు. దీంతో సచివాలయం పేరుకే అన్నట్టుగా ఉంది. అయితే.. శాఖల కార్యాలయాలను ఇక్కడ నుంచి తీసేశారా ? అంటే.. అవి కొనసాగుతున్నాయి. కానీ, సిబ్బంది మాత్రం వచ్చి తమ పనితాము చేసుకుని పోతున్నారు. అది కూడా కుదిరిన సమయంలో వచ్చి.. కుదిరినంత సేపు ఉండి వెళ్లిపోతున్నారు. ఆ మాటకు వస్తే కొందరు మంత్రులు సచివాలయానికి వచ్చినా వారి మాట తమ శాఖాధికారులే వినే పరిస్థితి లేదు. చాలా మంది మంత్రుల శాఖలను వైసీపీలో సలహాదారులుగా ఉన్న కీలక నేతలే కానిచ్చేస్తున్నారట. దీంతో మంత్రులు సైతం తాము మంత్రులుగా ఉండి ఉపయోగం ఏంటని వాపోతున్న పరిస్థితి.
ఇంకా చెప్పాలంటే ఈ పరిణామంతో విసిగిపోయిన ఇద్దరు మంత్రులు అయితే వచ్చే ప్రక్షాళనలో తమను మంత్రి పదవి నుంచి తప్పించేస్తేనే బెటర్ అనుకుంటున్న పరిస్థితి ఉందంటే సచివాలయంలో వాళ్లు ఎంత డమ్మీలు అయిపోయారో అర్థమవుతోంది. సచివాలయంలో జరుగుతోన్న ఈ పరిణామాలు అన్నీ ఇటీవల కాలంలో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఈ విషయంపై మంత్రిని ఒక పాత్రికేయుడు ప్రశ్నించాడు. ఎందుకంటే.. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి ఒకరు మీడియా మీటింగ్ పెట్టి ప్రతిపక్షంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అవకాశం వచ్చిందని భావించిన పాత్రికేయుడు తన మనసులో ఉన్న మాటను ప్రశ్నించేశాడు.
సార్.. సచివాలయానికి ఎందుకు వెళ్లడం లేదు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారు కదా! విద్యుత్ బిల్లులు, వాటర్ చార్జీలు కూడా లక్షల్లో వస్తున్నాయి. మరి ఇవన్నీ వృథానే కదా? అని ప్రశ్నించాడు. అంతేకాదు.. సందర్శకులు కూడా వివిధపనులపై వస్తున్నారు.. వారు కూడా పనులు పూర్తికాకపోవడం, మంత్రులు లేకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు.. పోనీ.. సచివాలయానికి రావొద్దనయినా.. చెప్పండి అని ప్రశ్నించారు. దీనికి సదరు ఫైర్ బ్రాండ్ మంత్రి ఆసక్తికర సమాధానం చెప్పారు. మేం.. దానిని ఎప్పుడో వదిలేశాం. అసలు రాజధానే వద్దని అంటే.. సచివాలయం గురించి ఎవరైనా అడుగుతారా ? ఇంకేదైనా ఉంటే అడుగు.. గడుసుగా ఎదురు ప్రశ్న వేయడంతో సదరు పాత్రికేయుడు మౌనం పాటించారు. ఇదీ.. సంగతి. ఇక, మీ ఇష్టం.. సచివాలయానికి వెళ్లినా పని అవుతుందనే గ్యారెంటీ లేదు..!!