చెన్నై: జల్లికట్టు అనగానే ఉరకలు వేస్తున్న ఎద్దు.. దానిని పట్టుకోవడానికి ప్రయత్నించే యువకులు.. ఇదే మనకు కనిపిస్తుంది. కానీ జల్లికట్టు పోటీలు ఎద్దులతోనే కాకుండా పందులతో కూడా నిర్వహిస్తారని తెలుసా..? అది కూడా జల్లికట్టుపు పుట్టినిల్లయిన తమిళనాడులోనే ఈ పందుల జల్లికట్టు కూడా నిర్వహించడం విశేషం. రాష్ట్రంలోని ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్రత్యేకంగా పందుల జల్లికట్టును నిర్వహిస్తారు. ఈ పందుల జల్లికట్టును చూడడానికి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేకమంది తరలివస్తారు.

సంక్రాంతిని పురస్కరించుకొని జల్లికట్టు పోటీలను నిర్వహించడం తమిళనాడులో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పటికీ అక్కడ అనేక జిల్లాల్లో ఎద్దులతో ఈ పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తారు. అయితే అదే రాష్ట్రంలోని తేని జిల్లా అల్లినగరం ప్రాంతంలో మాత్రం విడ్డూరంగా పందులతో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. వల్లినగర్‌ ప్రాంతంలో కురువర్‌ వర్గానికి చెందిన  వారు ఈ పందుల జల్లికట్టును నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ఈ వర్గానికి చెందిన దాదాపు 50కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా కలిసి సంక్రాంతి సందర్భంగా వన వేంగైగళ్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పందుల జల్లికట్టు నిర్వహించారు. అది కూడా అన్ని రకాల నిబంధనలతో పాటిస్తూ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు కూడా పరిసర ప్రాంతాల అనేకమంది ప్రజలు వచ్చారు.

ఈ పోటీల్లో 70 నుంచి 100 కిలోల బరువున్న పందులను మాత్రమే అనుమతిస్తారు. తాటి మానులతో ఏర్పాటు చేసిన వడివాసన్‌ నుంచి పంది మూడడుగుల దూరం వెళ్లిన తర్వాతే దానిని పట్టుకోవాలి. చివరి లైన్‌ దాటేలోపు కేవలం పంది వెనుక కాళ్లు మాత్రమే పట్టుకొని దానిని ఆపాలి. అలా ఆపిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఒకవేళ ఆ పందిని ఎవరూ ఆపలేకపోయినా.. ఆ పంది నేరుగా గీత దాటేసినా పందినే విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఈ పోటీల్లో తేని, దిండుగల్‌, మదురై జిల్లాల నుంచి 12 పందుల రాగా, 45 మంది యువకులు పాల్గొన్నారు. ఈ వింత జల్లికట్టును వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: